విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరాలి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే అంశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పోషకాహారం విషయంలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. వంట సిబ్బంది పరిశుభ్రత పాటించడంతో పాటు, తాజా ఆహార పదార్థాలనే వినియోగించాలన్నారు. గడువు ముగిసిన పదార్థాలు ఉపయోగించరాదని ఆదేశించారు. భోజనం నాణ్యంగా ఉందని అభినందిస్తూ, ప్రతిరోజూ ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తరచుగా పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా సమానంగా ముఖ్యమని, విద్యార్థులు క్రీడల్లోనూ రాణించి మంచి అలవాట్లు అలవరచుకోవాలని కోరారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, భద్రతా చర్యలు పటిష్టం చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపాల్ జీవరత్నం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


