అట్టహాసంగా బ్రహ్మోత్సవాలు
రేగొండ: భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతున్న కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం అభిషేకంతో మొదలయ్యాయి. అనంతరం స్వామి వారిని సూర్యవాహన సేవలో మాడ వీధుల గుండా ఊరేగించారు. ఈ సేవలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వస్తివాచనం అనంతరం శేషవాహనసేవ, అంకురారోహనం కార్యక్రమాలు కొనసాగాయి. జాతర మొదటి రోజు భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో దేదీప్యమానంగా వెలుగొందేందుకు అధికారులు ఆలయాన్ని దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ ఈఓ మహేష్, ఆలయ సిబ్బంది శ్రావణ్, రవీందర్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు.
నిత్య అన్నసత్రం ప్రారంభం
వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే నిత్య అన్న సత్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు కాసం నాగరాజు, గౌరవ అధ్యక్షుడు ఎర్రం సదాశివ శంకర్, సభ్యులు పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు
కొడవటంచ ఆలయంలో నేడు ధ్వజారోహణం (గరుడముద్ద), రాత్రి అశ్వవాహనసేవ, ఎదురుకోళ్లు అనంతరం స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు.


