రాలుతున్న ఆశలు
జిల్లా 654 ఎకరాల్లో సాగు..
భూపాలపల్లి రూరల్: మామిడి రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. గత పదిరోజులుగా వాతావరణ మార్పులతో బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు ఉధృతి మామిడితోటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పూత, పిందెలు నేలరాలుతున్నాయి. కళ్లెదుటే రాలిపోతున్న పూత, పిందెలను చూస్తూ మామిడి రైతులు నిరాశ చెందుతున్నారు. దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టాలపాలవుతామని ఆందోళనకు గురవుతున్నారు.
ఆదిలోనే కష్టాలు..
జిల్లాలో డిసెంబర్, జనవరి నెల నుంచే మామిడి చెట్లకు పూత పూయడం ప్రారంభమైంది. పూత పూసిన నెలరోజుల తర్వాత పిందెలు కాయడం, ఆ తర్వాత నెల, రెండు నెలలకి కాయ సైజు పెరుగుతూ వస్తుంది. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి తోటలకు ఈసారి పూత బాగా రావడంతో రైతులు సంతోషపడ్డారు. కానీ ప్రస్తుత వాతావరణ మార్పులతో ఆదిలోనే కష్టాల్లో పడ్డారు. బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు మామిడి తోటలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో మామిడి పూత, పిందెలు రాలిపోతున్నాయి. ప్రధానంగా జనవరిలో పూత వచ్చి, ఫిబ్రవరిలో పిందెలు వచ్చిన చోట ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పిందెలురాలి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. ఎన్ని మందులు వాడుతున్నా.. తెగుళ్ల ఉధృతి తగ్గడం లేదని అంటున్నారు. ఏడాదిగా కష్టపడుతూ అనేక మందులు కొడుతూ తోటలను కాపాడుకున్నా.. వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడులు తగ్గి, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేలపాలవుతున్న మామిడి పూత, పిందెలు
ఉద్యాన పంటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్ల తోటల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన నేలలు ఉండాలి. జిల్లాలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువ. సాగునీటి విషయానికి వస్తే చెరువులు, కుంటలతో పాటు బోర్లు, బావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్ల తోటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఈ క్రమంలోనే జిల్లాలో మామిడి, బత్తాయి, బొప్పాయి, జామ, సపోట డ్రాగన్ప్రూట్ తదితర పండ్లతోటలను సాగు చేస్తున్నారు. ఆయా పండ్లతోటల కంటే మామిడి సాగు ఎక్కువగా ఉంది. జిల్లాలో 654 ఎకరాల్లో మామిడి తోటలు పిందె, కాయ దశలో ఉన్నాయి.
తోటలపై తెగుళ్లు,
తేనెమంచు పురుగు ఉధృతి
వాతావరణ మార్పులే కారణం
దిగుబడులపై తీవ్ర ప్రభావం
ఆందోళనలో మామిడి రైతులు


