పకడ్బందీగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై తగు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరంలో 1,544 మంది, వృత్తి విద్యా కోర్సుకు 298 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,586 మంది, సెకండియర్ వృత్తి విద్యా కోర్సుకు 350 మంది మొత్తం 3,778 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలకు 20 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,544 మంది పదోతరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇంటర్, 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకన్న పాల్గొన్నారు.
కంట్రోల్ రూం రూం ఏర్పాటు..
విద్యార్థులకు సలహాలు, సందేహాల నివృత్తి, పరీక్షా కేంద్రాల సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 97052 99368, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 80088 78060 నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు.
మొబైల్ యాప్ తప్పనిసరి..
గ్రామస్థాయిలో మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేసి దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం జిల్లాలోని డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీఓలకు మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈ –డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
ఇంటర్మీడియట్ వార్షిక కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధమని స్పష్టం చేశారు. 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
పరీక్షలు రాయనున్న
3,778 మంది విద్యార్థులు
కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు


