పరీక్షలకు సన్నద్ధం
టెన్త్ విద్యార్థులకు
ప్రత్యేక తరగతులు
కాళేశ్వరం జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు
కాళేశ్వరం: పదో తరగతి బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక నజర్ పెట్టారు. టాప్ మార్కులే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను సమగ్రంగా సిద్ధం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే 100రోజుల కార్యక్రమంలో భాగంగా సిలబస్ పూర్తిచేసి, రివిజన్ చేపట్టారు. ప్రతి రోజూ ఒక్కో సబ్జెక్టుకు ప్రత్యేక సమయం కేటాయించి ముఖ్యమైన ప్రశ్నలు, బిట్ బ్యాంక్, మోడల్ పేపర్లపై సాధన చేయిస్తున్నారు. గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తూ ముఖ్యాంశాలను గుర్తించి విద్యార్థులకు వివరంగా బోధిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అదనపు క్లాసులు, డౌట్ క్లారిఫికేషన్ సెషన్లు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గంటపాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల హాజరు, చదువు పురోగతిపై చర్చిస్తున్నారు. ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఎక్కువమంది ప్రతిభ కనబరచాలని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఒక దఫా ప్రీ పైనల్ పరీక్షలు పూర్తి చేశారు. మళ్లీ రెండోదఫా మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత సంవత్సరం ఉత్తీర్ణత కన్నా ఈసారి మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సమయపాలన, పునరావృతం, ఆత్మవిశ్వాసం పెంపుపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి మెరుగైన ఫలితాలు సాధించి ఆదర్శంగా జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలవాలని ఉపాధ్యాయులు సంకల్పిస్తున్నారు. జిల్లాలో 122 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 3,548 మంది పదో తరగతి విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయనున్నారు.
ఉదయం, సాయంత్రం
గంటపాటు నిర్వహణ
మార్చి 14 నుంచి పరీక్షలు
ప్రత్యేక శ్రద్ధతో బోధన చేస్తున్న
ఉపాధ్యాయులు
పరీక్షలకు సన్నద్ధం


