న్యాయస్థానంలో అవినీతి జలగలు!
దృష్టిసారిస్తే
మరికొంత మంది..
జిల్లా కోర్టులో ఏసీబీ దాడుల కలకలం
భూపాలపల్లి అర్బన్: కొంతమంది లంచగొండి ఉద్యోగులతో న్యాయస్థానానికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన కోర్టులో శుక్రవారం జరిగిన ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. కొంతమంది అవినీతిపరులు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. కోర్టుకు వచ్చిన బాధితుల నుంచి మధ్యవర్తుల ద్వారా అందిన వరకు బలవంతంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రూ.వేలల్లో వసూళ్లు..
జిల్లా కేంద్రంలోని కోర్టులకు హాజరయ్యే వారినుంచి ఒక్కోపనికి ఒక్కోవిధంగా కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న ఒక ఉన్నతాధికారి బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా సివిల్ కేసులకు సంబంధించిన ఫైళ్ల నుంచి అధికంగా వేల రూ పాయలు చేతులు మారుతుంటాయి. డబ్బులు కిందిస్థాయి సిబ్బందితో తీసుకోవడమే కాకుండా నేరుగా ఫోన్పే, గూగుల్ పే ద్వారా తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఏసీబీకి పట్టుబడిన ముగ్గురు ఉద్యోగులు
జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో బాధితుడి నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటున్న ఇన్చార్జ్ ఏఓగా పని చేస్తున్న స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయిచరణ్, ఆఫీస్ సబార్డినేట్లు పున్నం రజిత, కొమ్ము సునీతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
రెవెన్యూ శాఖలోనే అధికంగా..
జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అవినీతి ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత 2016 సంవత్సరంలో చిట్యాల తహసీల్దార్, వీఆర్ఓ, 2018లో మహదేవపూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓ, వీఆర్ఏ భర్త, అదే ఏడాది చిట్యాల డిప్యూటీ తహసీల్దార్, 2019లో కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సీీసీ, 2021లో భూపాలపల్లి ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్, సర్వేయర్, టేకుమట్ల వీఆర్ఓ, 2022 జూలై 22న కాటారం తహసీల్దార్, భూపాలపల్లి ఎస్సై, 2023లో రేగొండ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వరిస్తున్న ఏఎస్ఓ, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్, 2024లో పంచాయతీ రాజ్లో ఈఈ, ఏటీఓ, సీనియర్ అసిస్టెంట్ ఒకేసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం జిల్లా కోర్టులో ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లా కోర్టులో ఆకస్మికంగా ఏసీబీ దాడులు జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు బాధితులకు ధైర్యం కల్పించి ప్రత్యేక దృష్టి సారిస్తే మరికొంత మంది పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలను సైతం ఓ అధికారి రూ.2 లక్షల చొప్పున అమ్ముకొని పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం.
లంచం తీసుకుంటూ చిక్కిన
ముగ్గురు ఉద్యోగులు
గతంలో అధికంగా
రెవెన్యూ శాఖలో దాడులు
న్యాయస్థానంలో అవినీతి జలగలు!


