దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: వచ్చే విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ఎంపికకు ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఇందిర గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేట్ ఉన్నత పాఠశాల నుంచి 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్, 5వ తరగతి రెసిడెన్షియల్ ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు ఆంగ్ల మాధ్యమ బోధన విడిగా వసతి గృహం, మౌలిక వసతులు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్లు, అర్హత గల అధ్యాపకులు కలిగి ఉండాలన్నారు. గడిచిన ఐదేళ్లలో పదో తరగతిలో 90శాతం ఉత్తీర్ణత, 50శాతం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. మార్చి 25వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని సూచించారు.
నష్ట పరిహారం చెల్లించాలి
మల్హర్(కాటారం): చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వీరాపూర్లో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని నిర్వాసితులు గురువారం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. వీరాపూర్ శివారులోని సర్వే నంబర్ 5, 6, 15, 17 నంబర్లలోని భూములు, రాఘవపల్లి శివారులో తమ భూములు సేకరించి, ఎంజైమెంట్ సర్వే నిర్వహించి ప్రాజెక్టు కట్టపోశారని చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులకు స్పందించి సేకరించిన భూములకు నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.
ములుగు రూరల్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవించదర్ అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని పత్తిపల్లి, దేవగిరిపట్నం, అనంపల్లి గ్రామస్తులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం జంగాలపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్పాషా, కూనూరు అశోక్గౌడ్, జగన్నాధచారి, కార్యకర్తలు పాల్గొన్నారు.
వాజేడు: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా సీఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ కమాండెంట్ ఎంకే సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సీఆర్పీఎఫ్ 81వ బెటాలియన్, లిటిల్ క్రాస్ సొసైటీ ఎన్జీఓ సహకారంతో చేపట్టినట్లు వివరించారు. ఈ కుట్టు మిషన్ శిక్షణ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా నేర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంకే సింగ్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 17 గ్రామ పంచాయతీలకు చెందిన మహిళలు, లిటిల్ క్రాస్ సొసైటీ ఎన్జీఓ డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
దరఖాస్తుల స్వీకరణ


