పుష్కరఘాట్ల నిర్మాణానికి చర్యలు
ఏటూరునాగారం: వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆర్డీఓ వెంకటేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పుష్కరఘాట్లు, పార్కింగ్ స్థలాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ముళ్లకట్ట, రామన్నగూడెం పుష్కరఘాట్లను ఆర్డీఓ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ముళ్లకట్ట, రామన్నగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎక్కడ అయితే గోదావరి లోతు తక్కువగా ఉంటుందో అక్కడ ఘాట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఘాట్ సమీపంలో గోదావరి లోతు 20 ఫీట్లు ఉండగా ఆ లోతు మరింత తగ్గించి భక్తులు పుణ్యస్నానాలను ఆచరించే విధంగా చూడాలని సూచించారు. ఘాట్కు వచ్చే వాహనాల మళ్లింపు, వన్ వే వంటి విషయాలపై సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సీఐ శ్రీనివాస్ పార్కింగ్ స్థలాలు, వాహనాల రాకపోకలు , పార్కింగ్ విషయాలపై సమగ్రంగా చర్చించాలన్నారు. గ్రామంలోని ప్రజలు వారి అభిప్రాయాలను తీసుకొని గతంలో దానికంటే భిన్నంగా సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దీనిపై స్థానికులు అధికారులకు సహకరించి పుష్కరాలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.


