భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రేగొండ: లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు, విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని కొడవటంచలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ పునఃప్రతిష్ట, 26 నుంచి మార్చి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నుట్లు తెలిపారు. 21న కోటంచ ఆలయానికి త్రిదండి చిన్నజీయర్ స్వామి, శాసనసభ స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర వీఐపీలు స్వామి వారి దర్శనానికి రానున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ అందించాలన్నారు. ఆలయ ఆవరణలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. రహదారులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. వీఐపీలు, ఇతర వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను గుర్తించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మీ, ఆలయ చైర్మన్ సంపత్రావు, ఈఓ మహేష్ పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కొడవటంచలో ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో కోటంచ ఆలయ అభివృద్ధి కొరకు ఇచ్చిన మాట ప్రకారం రూ.12.15 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొని మొక్కులు చెల్లించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు


