నెలలోనే.. మీటరు లోతుకు..
జిల్లాలో తగ్గుతున్న భూగర్భజలాలు
నీటి మట్టం వివరాలు (మీటర్లలో..)
భూపాలపల్లి రూరల్: యాసంగి పంటల సాగుకు నీటి వినియోగం పెరగడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం క్రమంగా తగ్గుతోంది. ఎండలు సైతం ఫిబ్రవరిలోనే హడలెత్తిస్తుండడంతో నెల రోజుల్లో దాదాపు ఒక మీటరు లోతుకు పడిపోయింది. వేసవిలో సాగు నీటి అవసరాలు పెరిగితే భూగర్భ జలాలు పాతాళానికి చేరే అవకాశాలున్నాయి. జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకుంది. ఇప్పటికే 95,590 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
గణపురం సరస్సు కింద 3వేల ఎకరాలు, భీం ఘన్పూర్ చెరువు కింద 1,500 ఎకరాలలో పంటలు సాగవుతుండగా, బోర్లు, మిగితా బావుల కింద సాగవుతున్నట్లు అంచనా. దీనికితోడు 28,678 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్నారు. వరికే నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగవుతుండడంతో సాగునీటి అవసరం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. డిసెంబర్లో సాధారణ నీటిమట్టం 7.48 మీటర్లు కాగా, జనవరిలో 8.38 మీటర్లకు పడిపోయింది. దాదాపు ఒక మీటరు లోతుల్లోకి వెళ్లాయి. ఈసారి వర్షాకాలంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. అది కూడా ఒకేసారి దంచికొట్టిన వానలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయి. తర్వాత వర్షాల జాడ కరువైంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. కాటారం మండలంలో 2.57 మీటర్లు పడిపోగా రేగొండ 1.39 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది.
ముదురుతున్న ఎండలు..
సాధారణంగా మార్చిలో ఎండల తీవ్రత ఉంటుంది. కానీ ఈ సారి ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. జిల్లాలో 30 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు ముదరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత యాసంగి పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎండలతో పంటలకు ఎంత నీరు అందించినా వెంటవెంటనే ఆరిపోతూనే ఉంది. ముఖ్యంగా వరి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంకా రెండున్నర నెలలకు పైగా నీరందించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి పొట్ట దశలో ఉన్నప్పుడు నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. ఇప్పుడే భూగర్భ జలమట్టం పడిపోతుండడంతో బోర్లలోని ఊటలు తగ్గిపోతున్నాయి. ఎండలు మరింత ముదిరితే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి. బోర్లు ఎత్తిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో పంటలు గట్టెక్కడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో నీటి వినియోగం పెరిగి భూగర్భ జలమట్టం పడిపోతోంది. నీటిని పొదుపు వాడుకోవాలి. ఏ పంటకు ఎంత అవసరమో అంతమేర నీటినే వాడాలి.
– కె. శ్రీనివాసరావు,
జిల్లా భూగర్భజల అధికారి
మండలం డిసెంబర్ జనవరి
2025 2026
భూపాలపల్లి 7.77 8.97
చిట్యాల 4. 35 3.65
గణపురం 4.50 4.66
కొత్తపల్లిగోరి 2.90 3.46
కాటారం 18.73 20.16
మహదేవపూర్ 11.33 11.93
మహాముత్తారం 2.57 3.67
మల్హర్ 13.23 13.90
మొగుళ్లపల్లి 3.18 3.93
పలిమెల 9.20 10.03
రేగొండ 2.60 3.21
టేకుమట్ల 3.00 3.68
ఫిబ్రవరిలోనే హడలెత్తిస్తున్న ఎండలు
పెరుగుతున్న నీటి వినియోగం
నెలలోనే.. మీటరు లోతుకు..
నెలలోనే.. మీటరు లోతుకు..


