మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
భూపాలపల్లి: మహిళా సాధికారతే తమ లక్ష్యమని, మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అపార గౌరవం ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని టీ 2 క్వార్టర్స్ చుట్టూ రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అటవీ రక్షణ గోడ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా సంఘాలకు రూ. కోటి బ్యాంక్ లింకేజీ, రూ. 20 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేయడంతో పాటు, 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి సంకల్పంలో భాగంగా వారికి సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.60 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి బాంబులగడ్డ నుంచి గణపురం గాంధీనగర్ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 500 కోట్లు మంజూరు చేయించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం భూపాలపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని అన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. భూపాలపల్లి, కాటారం డివిజన్లలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, మెప్మా పీడీ రాజేశ్వరి, ఎంపీడీఓ తరుణ్ప్రసాద్, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం
రేగొండ: పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో రూ.3.75 కోట్లతో నిర్మించనున్న బస్టాండ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతీ నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. బస్టాండ్ నిర్మాణంతో చుట్టూ పక్కల మండలాలకు రవాణా సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్టీసీ కార్పొరేషన్ ఈడీ సలోమన్, ఆర్ఎం విజయభాను, డీఎం హిందూ, ఆర్టీఓ సంధాని, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, సర్పంచ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
అభివృద్ధి చేయకపోతే ఓట్లు అడగను
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం


