వరంగల్ లీగల్ : హైకోర్టు న్యాయమూర్తి, ఉ భయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేనారెడ్డి ఈనెల 25న (శనివారం) హనుమకొండ జిల్లా కోర్టుకు రానున్నారు. హనుమకొండ జిల్లాకు నూతనంగా మంజూరైన అదనపు జిల్లా కోర్టు, రెండు జూనియర్ సివిల్ కోర్టులను ప్రారంభించనున్నారు. శనివా రం ఉదయం 10 గంటలకు అయన జిల్లా కోర్టు ప్రాంగణంలోని 10 కోర్టుల భవనంలో ఈ ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
వైభవంగా ముగిసిన పుష్కర మహోత్సవాలు
జనగామ: పట్టణంలోని బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన తృతీయ పుష్కర మహోత్సవాలు గురువారం మహా పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఐదో రోజు కార్యక్రమాల్లో భాగంగా త్రిదండి చినజీయర్ స్వామి భక్తులకు తీర్థగోష్టి నిర్వహించారు. సుమారు 250 మందికి పైగా దంపతులు వెంకటేశ హోమంలో పాల్గొనగా, 3 వేల మందికిపైగా భక్తులు శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం 10 వేల మందికిపైగా భక్తులకు తదియారాధన ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మహాకుంభ సంప్రోక్షణ, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చినజీయర్ స్వామి భక్తులకు మంగళాశాసనాలు అందిస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు నిరంతరం జరగాలని ఆకాంక్షించారు. భక్తులు, వికాస తరంగిణి సభ్యులు, దేవాలయ సేవా బృందానికి అభినందనలు తెలిపారు.
నషాముక్త్ భారత్
పోస్టర్ ఆవిష్కరణ
జనగామ రూరల్: మేరా యువభారత్ ఆధ్వర్యంలో నషాముక్త్ ఫర్ వికసిత్ భారత్ పోస్టర్ను డీసీపీ రాజమహేంద్ర నాయక్ తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ నెల 25న మండలంలోని యశ్వాంతపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే డ్రగ్ ఫ్రీ కార్యక్రమంలో ఫోక్ యువత అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఫోక్ సాంగ్స్, డ్యాన్స్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి, రాష్ట్రస్థాయి కార్యక్రమానికి పంపించడం జరుగుతుందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవీన్ యాదవ్ ఈసందర్భంగా తెలిపారు.
ప్రపంచంలోనే ఎత్తయిన
రహదారిపై జిల్లా యువకుడు
జనగామ రూరల్: పట్టణానికి చెందిన యువకుడు పంతం సాయిప్రసాద్ అరుదైన రికార్డు సాధించారు. సాహస యాత్రపై ఉన్న అభిరుచితో తన సొంత వాహనంలో జనగామ నుంచి బయలుదేరి, దేశ రాజధాని ఢిల్లీ, లడఖ్, ప్రసిద్ధ పాంగాంగ్ సరస్సు మీదుగా ప్రయాణించి ప్రపంచంలోనే అతి ఎత్తైన రహదారిగా గుర్తింపు పొందిన ‘ఉంలింగ్ లా పాస్’ను విజ యవంతంగా చేరుకున్నారు. సముద్ర మట్టాని కి ఏకంగా 19,024 అడుగుల అసాధారణ ఎత్తులో ఉండే ఈ ఉంలింగ్ లా పాస్ భారత్ – చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంది. ప్రమాదకరమైన వాతావరణం, అత్యంత తక్కువ ఆక్సిజన్ స్థాయిలు ఉండే ఈ ప్రాంతానికి తన వాహనంపై చేరుకుని సాయి ప్రసాద్ యువతకు ఆదర్శంగా నిలిచారు. జనగామ పేరును జాతీయస్థాయిలో సగర్వంగా నిలిపిన సాయి ప్రసాద్ను స్థానికులు అభినందించారు.


