పేదలకు చేయూతగా ‘జాతీయ కుటుంబ ప్రయోజన పథకం‘
లింగాలఘణపురం: కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబానికి చేయూతగా ప్రభుత్వం నేరుగా రూ.20వేలు బ్యాంక్లో జమచేసే పథకమే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం–ఎన్ఎఫ్బీఎస్). ఈ పథకం 2023లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రారంభించగా రాష్ట్ర ప్రభుత్వం 2024 నుంచి ఎన్ఎఫ్బీఎస్గా అమలవుతోంది. ఇందులో కుటుంబ యజమాని అంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి..అనగా తల్లి, తండ్రి, ఇంటికి పెద్ద కుమారుడు, కూతురు..ఇలా ఒక కుటుంబం వీరిపై ఆధారపడి ఉంటే ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకున్న వారం పది రోజుల్లోనే నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఈ పథకంలో గతంలో తహసీల్దార్ల పరిధిలో నుంచి ఆర్డీఓలకు అక్కడి నుంచి కలెక్టర్ అప్రూవల్ తీసుకొని డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యేది. దీంతో జాప్యం జరుగుతుందని ప్రస్తుతం ఎంపీడీఓలకు అప్పగించారు. ఎంపీడీఓల నుంచి డీఆర్డీఓ, కలెక్టర్ అప్రూవల్తో సెర్ప్ నుంచి డబ్బులు జమ అవుతాయి. జిల్లాలో జనగామ మండలంలో ఎక్కువగా 30 మంది దరఖాస్తు చేసుకోగా నర్మెటలో కేవలం ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంపై ఇంకా గ్రామాల్లో విస్త్రృత ప్రచారం చేయాల్సి ఉంది.
ఇప్పటి వరకు 196 దరఖాస్తులు
జిల్లాలో ఇప్పటి వరకు 196 దరఖాస్తులు రాగా అందులో 5 డీఆర్డీఓ రిజెక్ట్ చేశారు. మిగిలినవి ఆయా అధికారుల లాగిన్లలో ఉండగా 13 మంది లబ్ధిదారులకు మాత్రమే బ్యాంక్ల్లో రూ.20వేల చొప్పున జమ అయ్యాయి.
మండలాల వారీగా దరఖాస్తుల వివరాలు..
బచ్చన్నపేట–8, చిల్పూరు–22, దేవరుప్పుల–23, స్టేషన్ఘన్పూర్–6, జనగామ టౌన్–8, జనగామ –30, కొడకండ్ల 24, లింగాలఘణపురం 10, నర్మెట–1, పాలకుర్తి –22, రఘునాథపల్లి –13, స్టేషన్ఘన్పూర్ మండలం 10, తరిగొప్పుల –6, జఫర్గఢ్–13 ఉన్నాయి. ఇందులో ఎంపీడీఓలు 60 అప్రూవ్ చేయగా 136 పెండింగ్లో ఉన్నాయి. డీఆర్డీఓ పరిధిలో 55 అప్రూవ్ కాగా 5 రిజెక్ట్ చేశారు. సెర్ప్లో 13 అప్రూవ్ కాగా 42 పెండింగ్లో ఉండి. 13 మందికి బ్యాంక్ల్లో జమ అయ్యాయి. అందులో రఘునాథపల్లిలో 6, కొడకండ్లలో 4, దేవరుప్పులలో 3 ఉన్నాయి.
అవసరమైన సర్టిఫికెట్లు
మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్కార్డ్, రేషన్కార్డు, బ్యాంక్ పాసు బుక్, రెవెన్యూ అధికారి ధ్రువీకరించిన కుటుంబ సభ్యుల సర్టిఫికెట్తో పాటు ఒక ఫొటోను జతపరచాలి. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని మండల కేంద్రాల్లోనైతే ఎంపీడీఓలకు, మున్సిపాల్ పరిధిలో కమిషనర్లకు దరఖాస్తు ఫారాలను అందజేయాలి. అక్కడి నుంచి వారి లాగిన్లో ఒకే చేస్తే డీఆర్డీఓకు, అక్కడి నుంచి కలెక్టర్కు, ఆ తరువాత సెర్ప్ నుంచి నేరుగా లబ్ధిదారుల జాబితాలో జమ అవుతాయి.
కుటుంబ యజమాని చనిపోతే
రూ.20వేలు
పథకం అమలు బాధ్యతలు ఎంపీడీఓలకు
పథకానికి అర్హులు ఎవరంటే..?
చనిపోయిన కుటుంబం బీపీఎల్ (పేద కుటుంబం) జాబితాలో ఉండాలి. 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన వారై ఉండి ఆ కుటుంబబం మొత్తం వారి ఆదాయంపై ఆధారపడి జీవనం సాగించాలి. మహిళలైన, పురుషులైన అర్హులే అవుతారు. గతంలో ఏఏబీవై, జేబీవై, ఆపద్బాంధు పథకం తీసుకుంటే మాత్రం అనర్హులు అవుతారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మరణించినా, సహజ మరణమైన ఈ పథకం వర్తిస్తుంది.


