జనగామ: సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు గ్రామ పంచాయతీల హక్కులు, ఆర్థిక స్వయం ప్రతిపత్తి కోసం సర్పంచులంతా ఐక్యంగా పోరాడాలని జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్ గోపగోని శ్రీధర్ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు నిర్వహించారు. సర్పంచుల ఫోరం జిల్లా కన్వీనర్ గోపగోని శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వం వసూలు చేస్తున్న మైనింగ్ ఆదాయం, స్టాంప్ డ్యూటీ తదితర పన్నులను గ్రామ పంచాయతీలకే బదిలీ చేయాలని, ఉప సర్పంచ్లకు కల్పించిన చెక్పవర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో పంచాయతీరాజ్ మాజీ అధ్యక్షుడు మెట్టుపల్లి పురుషోత్తంరెడ్డి, పంచాయతీరాజ్ ఉపాధ్యక్షుడు అశోక్రావు, రాష్ట్ర మాజీ ఎంపీపీల సంఘం అధ్యక్షుడు శ్రీశైలం, పంచాయతీ రాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ, రాష్ట్ర కార్యదర్శి వెంకట్, జిల్లా అధ్యక్షుడు రాకేష్రెడ్డి, సంపత్ నాయక్, సర్పంచులు పాల్గొన్నారు.
సర్పంచ్ల చైతన్య సదస్సులో
జిల్లా కన్వీనర్ శ్రీధర్గౌడ్


