విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ తీర్ధయాత్రల్లో భాగంగా కరీంనగర్ 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 26న అరుణాచలం యాత్రకు బయలుదేరుతుందని కరీంనగర్ 1డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సు బయలుదేరి కాణిపాకం, కంచి, అరుణాచలం, శ్రీరంగం, మదురై, రామేశ్వరం, జోగులాంబ దర్శనాలు చేసుకుని ఈనెల 31న సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకుంటుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.7,300, పిల్లలకు రూ.5,475గా టికెట్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 7382849352, 9959225920 నంబర్లలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.
24 గంటల్లోనే చోరీ కేసు ఛేదన
కరీంనగర్క్రైం: నగరంలోని త్రీ టౌన్ పరిధిలో జరిగిన చోరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1,25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం తులసీనగర్, వావిలాలపల్లికి చెందిన తోట రోహిత్ ఈ నెల 22న తన తల్లితో కలిసి డిమార్ట్కు షాపింగ్కు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో దాచిన రూ.4.80 లక్షల నగదు అపహరించి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని విశ్లేషించి నిందితుడు దేవనవేణి మహేశ్గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని, రూ.1.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్ చేశారు. కేసును ఛేదించిన త్రీటౌన్ ఎస్సై బి.చేరాలు, కానిస్టేబుల్ కె.ప్రశాంత్ను సీఐ తిరుమల్ అభినందించారు.
గుండెపోటుతో ఉప్పుమడుగు సీఈవో మృతి
రాయికల్: రాయికల్ మండలం ఉప్పుమడుగు సహకార సంఘం సీఈవో సుతారి తిరుపతి (56) గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన తిరుపతి ఉదయం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు జగిత్యాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. తిరుపతి మృతిపై జిల్లా సహకార సంఘ అధికారి మనోజ్, డీజీఎం సత్యప్రసాద్, మాజీ మంత్రి జీవన్రెడ్డి, సహకార సంఘం సీఈవోలు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
విషజ్వరంతో బాలుడి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన కాముని వరుణ్తేజ (6) విష జ్వరంతో గురువారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన కాముని అర్జయ్య, సరిత చిన్న కుమారుడు వరుణ్ తేజ యూకేజీ చదువుతున్నాడు. బుధవారం జ్వరం రావడంతో తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు కరీంనగర్కు తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదేకాలనీకి చెందిన మరో బాలిక విషజ్వరంతో అపస్మారకస్థితికి వెళ్లింది. జిల్లా వైద్యాధికారి సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేపట్టారు.


