దేశవ్యాప్తంగా సుశిక్షితులైన 70 మందితో క్రిమినల్ నెట్వర్క్
బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కేసులు
చోరీ చేసిన మొబైళ్లు, ఎన్క్రిప్టెడ్ యాప్స్(ఫేస్టైంతో సహా)తో జైలు నుంచే వీడియోకాల్స్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఆదేశాలు
గోల్డ్లోన్ కంపెనీలు, నగల దుకాణాలు, జువెల్లరీ షోరూంలే టార్గెట్
అనుచరులకు వేతనాలు, నేరాల్లో ప్రతిభ కనబరిస్తే బోనస్లు
పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్ సంస్థల నుంచి 30కిలోలకు పైగా బంగారం తస్కరణ.
ప్రస్తుతం బిహార్, వెస్ట్బెంగాల్లో పలు కేసులు ఎదుర్కొంటున్నాడు.
పీఎంజే జువెల్లరీ దోపిడీ సుబోధ్ ముఠా పనే ఈనెల 7నే వివరాలు వెల్లడించిన ‘సాక్షి’ మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి తుపాకులు సరఫరా నిందితులకు ఒకరితో మరొకరికి లేని పరిచయం సొత్తు చోరీ, రవాణా, విక్రయాలకు ప్రత్యేక ముఠాలు దేశ సరిహద్దులు దాటి నేపాల్ చేరిన బంగారం
దోపిడీ జరిగింది: మే 3, 2026
దోపిడీకి పాల్పడింది: సుబోధ్ ముఠా, బిహార్
ఎత్తుకెళ్లిన నగల విలువ : రూ.82,02,000
దోపిడీలో పాల్గొంది: 13 మందికిపైగా
చిక్కిన నిందితులు: ముగ్గురు
పరారీలో ఉన్నవారు: దాదాపు 10 మంది
వాడిన ఆయుధాలు: 6 పిస్టళ్లు, 12 మేగ్జిన్లు, 60 బుల్లెట్లు
రికవరీ అయిన సొత్తు: ఏమీ లేదు
స్వాధీనం చేసుకున్నవి: రూ.51వేల నగదు, పల్సర్, హెల్మెట్, సెల్ఫోన్లు 2, సిమ్కార్డులు 2, నకిలీ ఆధార్కార్డు
గాలించిన రాష్ట్రాలు: బిహార్,పశ్చిమ బెంగాల్
పాల్గొన్న సిబ్బంది: 132 మంది కరీంనగర్ సిబ్బంది, 24 మంది ఎస్పీలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురినే పట్టుకోగలిగారు. ఈ దోపిడీలో మొత్తం 13 మంది పాల్గొనగా.. మిగిలిన 10 మంది కోసం గాలిస్తున్నారు. బిహార్ జైలులో ఉన్న ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్సింగ్ జైలు నుంచే ఈ ఆపరేషన్ను నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చూపిస్తూ గురువారం సీపీ గౌస్ ఆలం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జారీరా సింగ్, బిహార్కు చెందిన రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమన్లు, వీరికి సిమ్కార్డులు సరఫరా చేసిన మెహతాబ్ఖాన్ అలి యాస్ మహబూబ్ఖాన్ను అరెస్ట్ చేయగా, మరో 10 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టూ టౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన ఈ కేసులో రూ.82.02 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ సమయంలో జ్యువెలరీ షాప్ సిబ్బందిపై కాల్పులు జరపడంతో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే.
జైలు నుంచే మాస్టర్ప్లాన్
ఈ దోపిడీ వెనుక బిహార్లోని కరుడుగట్టిన నేరగాడు సుభోద్సింగ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్సింగ్ జైలులో నుంచే తన అనుచరులకు ఆదేశాలిస్తూ దేశవ్యాప్తంగా దోపిడీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిహార్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో ఈ ముఠా 20కి పైగా దోపిడీలకు పాల్పడినట్లు, 400 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లినట్లు సమాచారం. సుభోద్సింగ్ ఆదేశాలతో ప్రధాన నిందితులు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరాసింగ్, రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమన్, రాధే అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్ తదితరులు రెండు నెలల క్రితమే తెలంగాణకు వచ్చారు. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో జ్యువెలరీ షాపులు, బ్యాంకులపై రెక్కీ నిర్వహించారు. చివరికి కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ షాప్ను ఎంచుకున్నట్లు వెల్లడించారు. రెక్కీ సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని, వాటి ఆధారంగానే పారిపోయారు. నకిలీ ఆధార్కార్డులు, తెలంగాణ, ఒడిషా ఫేక్ బైక్ నంబర్ ప్లేట్లు, తప్పుడు పేర్లతో లాడ్జీలలో బస చేస్తూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. ఈక్రమంలో సిద్దిపేట, పెద్దపల్లి, ధర్మపురి లాడ్జీల్లో బసచేశారు. వీరంతా ఒకరికితో మరొకరికి పరిచయం లేదు. అందరికీ ఇచ్చిన నకిలీ గుర్తింపుకార్డుల పేర్లతోనే పిలుచుకున్నారు. దోపిడీ చేసిన బంగారాన్ని ఇప్పటికే కరిగించి నేపాల్ చేర్చినట్లు అనుమానిస్తున్నారు.
చంద్రాపూర్ అడవుల్లో తుపాకులు
పోలీసుల విచారణలో నిందితుల నేరపద్ధతి సంచలనంగా మారింది. ఝార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఒక్కో సిమ్కార్డును రూ.10వేల చొప్పున కొనుగోలు చేసినట్లు తేలింది. దోపిడీకి ముందు రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాల నుంచి రైలులో చంద్రపూర్ సమీపానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే ముఠాకు చెందిన వ్యక్తుల నుంచి ఆరు పిస్టల్స్, 60 బుల్లెట్లతో 12 మ్యాగ్జిన్లు తీసుకుని తిరిగి ధర్మపురికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈనెల 3న ధర్మపురి నుంచి వచ్చి జ్యువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడి, నలుగురు సిబ్బందిని కాల్చి ముందుగానే రెక్కి చూసి మెయిన్ రోడ్లపై కాకుండా గ్రామాల్లోని కాలువలు, చిన్న రోడ్ల ద్వారా ధర్మపురి చేసుకున్నారు. ధర్మపురి వద్ద పల్సర్ను వదిలేసి, ముగ్గురు దొంగలు కాలినడకన గోదావరినది దాటి మంచిర్యాల వద్ద రైలెక్కి పారిపోయారు. అపాచీ మీదున్న ఇద్దరు దొంగలు ఆభరణాలతో అడవి మార్గంలో వెళ్లి క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు నగల బ్యాగ్ అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. కీలక నిందితులైన గ్యాంగ్ లీడర్ సుభోద్సింగ్తోపాటు రాధేమిశ్రా అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్, మిశ్రా తదితరులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. జ్యువెల్లరీ షాపులు, బ్యాంకులు, లాడ్జీ యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నాణ్యమైన పానిక్ బటన్లు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఐపీఎస్ అధికారి సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్కుమార్తోపాటు పలువురు సీఐలు పాల్గొన్నారు.
‘గోల్డెన్ థీఫ్’ ప్రత్యేకతలు
కేసు వివరాలు


