కరీంనగర్: బ్లడ్ కేన్సర్ చికిత్స రంగంలో ఆధునిక సాంకేతికత, అత్యాధునిక వైద్య పద్ధతులతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం బ్లడ్ కేన్సర్ చికిత్స మరింత సమర్థవంతంగా మారిందన్నారు. బ్లడ్ కేన్సర్ చికిత్సలో ప్రస్తుతం టార్గెటెడ్ మెడిసిన్స్, ఇమ్యూనో థెరపీ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ చికిత్సల వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం కేన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించడం సాధ్యమవుతోందన్నారు. గతంలో అందుబాటులో లేని పలు అధునాతన చికిత్సలు ఇప్పుడు భారతదేశంలో కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుండటం వైద్య రంగంలో సానుకూల పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు.


