ముస్తాబాద్(సిరిసిల్ల): వృద్ధాప్యం.. అనారోగ్యం..ఒంటరితనం భరించలేని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన సోల నర్సయ్య(80) భార్య నలభై ఏళ్ల క్రితం విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటి నుంచి నర్సయ్య ఒంటరిగా ఉంటున్నాడు. గుడిసెలో దుర్భర జీవితం గడుపుతున్న నర్సయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒంటరి జీవితం ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి మృతి
గోదావరిఖనిటౌన్: కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వస్తున్న కరీంనగర్–2 డిపో బస్సులో మహారాష్ట్ర సిరొంచకు చెందిన అబ్ధుల్ రజాక్ కరీంనగర్లో గోదావరిఖనికి టికెట్ తీసుకున్నాడు. స్టాఫ్ వద్ద దిగకపోవడంతో కండక్టర్ గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇతడు మార్గమధ్యలో చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు.
గంగాధర: మండలంలోని మప్పిడినర్సింహులపల్లి జీపీ పరిధి పెండలోనిపల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ముత్యాల హేమలత ఈ నెల 11న ఇంటికి తాళం వేసిన బంధువుల దగ్గరికి వెళ్లిది. బుధవారం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని ముప్పై తులాల వెండి, ఐదు గ్రాముల బంగారం, రూ.ఏడువేలు దొంగలు ఎత్తుకెళ్లారని, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
బాల్య వివాహం అడ్డగింత
పెగడపల్లి: మండలంలోని మద్దులపల్లిలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలికకు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. విషయం తెలుసుకున్న ఆర్ఐ జమున, చైల్డ్లైన్ కో–ఆర్డినేటర్ శ్రావణ్, బాలల పరిరక్షణ సమితి ఔట్రిచ్ శ్రీవాణి, అంగన్వాడీ టీచర్లు శోభ, శైలజా, పోలీసు సిబ్బంది శ్రీకాంత్, చంద్రశేఖర్ గ్రామానికి వెళ్లారు. ఆధార్కార్డు, పుట్టిన తేదీ, పదో తరగతి సర్టిఫికెట్లను పరిశీలించారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నతనంలో వివాహం చేస్తే అనర్థాలు జరుగుతాయన్నారు. 18 ఏళ్లు దాటే వరకూ వివాహం చేయబోమని తల్లిదండ్రులు అంగీకార పత్రం రాయించి ఇవ్వడంతో అధికారులు వెళ్లిపోయారు.
రేబిస్తో చిన్నారి మృతి
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన బాలులు రేబిస్తో బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన లోకుర్తి రాజు–మమతల కొడుకు లోకుర్తి నిశాంత్(11) ఇటీవల 5వ తరగతి పూర్తి చేసుకుని వేసవి సెలవుల్లో సరదాగా గడుపుతున్నాడు. ఏప్రిల్ 23న గ్రామంలో ఓ పిచ్చికుక్క కరవడంతో తలకు, తొంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి వ్యాక్సిన్లు ఇప్పించారు. వారం రోజుల తర్వాత తీవ్ర జ్వరం రావడంతో కరీంనగర్కు తీసుకెళ్లారు. రేబిస్తో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు నిర్ధారించిన వైద్యులు హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. వారం రోజులుగా నిశాంత్ హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.


