● మల్యాల మండలంలో మొదటి దళిత డాక్టర్
● నిఖిత వైద్య విద్యకు ‘సాక్షి’ దాతల తోడ్పాటు
మల్యాల: నిరుపేద దళిత కుటుంబం నుంచి డాక్టర్ స్థాయికి ఎదిగారు మల్యాల మండలంలోని మ్యాడంపల్లికి చెందిన బెక్కం నిఖిత. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. ఎంబీబీఎస్ సీటు సాధించారు. గ్రామానికి చెందిన బెక్కం గంగయ్య, పద్మ ఏకై క కూతురు నిఖిత సిరిసిల్లలోని బోనాల రెసిడెన్షియల్లో పదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్ గౌలిదొడ్డి రెసిడెన్షియల్లో ఇంటర్ పూర్తి చేసి.. నీట్లో ర్యాంకుతో ఎంబీబీఎస్లో సీటు సాధించారు. అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ‘సాక్షి’ 2020 డిసెంబర్ 10న ‘సరస్వతీ పుత్రికకు లక్ష్మీకటాక్షం కరువు..’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన దాతలు ఎంబీబీఎస్ విద్యకు తోడ్పాటు అందించారు. వైద్య విద్యలోకి అడుగు పెట్టిన నిఖిత.. విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్ పట్టా అందుకున్నారు. తమ కూతురు డాక్టర్ కావడం ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తన కల సాకారం చేసుకునేందుకు తోడ్పాటునందించిన అందరికీ నిఖిత కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలకు సేవలందించడమే లక్ష్యంగా డాక్టర్ వృత్తిలోకి అడుగు పెట్టానని, ఆపదలో ఉన్న వారికి తనవంతుగా సాయమందిస్తానని తెలిపారు.


