● మహిళ మృతి.. మరో ఇద్దరికి గాయాలు
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వర్రావునగర్ బస్టాండ్ వద్ద బుధవారం బస్సు కోసం ఎదురుచూస్తున్న ముగ్గురిపైకి స్కార్పియో వాహనం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు. రాజేశ్వర్రావునగర్ బస్టాండ్ వద్ద అదే గ్రామానికి చెందిన చల్ల లక్ష్మి, బోయిని రజిత, యశ్వంత్ సిరిసిల్లకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి వైపు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చల్ల లక్ష్మి(35) అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడ్డ బోయిని రజిత, యశ్వంత్లను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. చల్ల లక్ష్మి భార్యభర్తలు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఇంటికి పెద్ద దిక్కు అయిన లక్ష్మి మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ప్రమాదానికి కారణమైన కారు మహారాష్ట్రకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు.


