చివరి ధాన్యం గింజా కొంటాం | - | Sakshi
Sakshi News home page

చివరి ధాన్యం గింజా కొంటాం

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

గొల్లపల్లి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మక్కలు, ధాన్యం చివరి గింజవరకూ కొనుగోలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ తెలిపారు. గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్‌లోని మక్కల కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు జిల్లాలో 1.26లక్షల టన్నుల ధాన్యం కొన్నామని, రూ.153 కోట్లు రైతు ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు. మక్కల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడి గాయపడిన నలుగురు రైతులకు మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. గొల్లపల్లి, రాఘవపట్నంలోని గోదాములను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామన్నారు. జిల్లాలో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న 18 మిల్లులకు అనుమతులు వచ్చాయన్నారు. తూకం విషయంలో తేడా రానీయొద్దని అధికారులను మంత్రి ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. ఏఎంసీ చైర్మన్‌ బీమ సంతోష్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నిషాంత్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి, సర్పంచులు అంజలి, గంగాధర్‌, అఖిల అనిల్‌, కొలగాని శ్రీలత, కాసారపు భవాని అరవింద్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి పాల్గొన్నారు.

విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట

ధర్మపురి: విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అన్నారు. ప్రజాపాలనలో భాగంగా స్థానిక బాలికల పాఠశాలలో విద్యాభివృద్ధిపై సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించాలన్నారు. బండి సంజయ్‌ కుమారుడి కేసుపై ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించిందన్నారు. గ్రంథాలయ చైర్మన్‌ ఎస్‌ దినేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ లావణ్య, డీఈవో రాము, ఎంఈవో సీతామహాలక్ష్మి తదితరులున్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement