గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
జగిత్యాల: 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అందుకు అన్ని రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గోదావరి పుష్కరాలపై గురువారం అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలకు మన జిల్లాలో అనేక భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటి నుంచే ఘాట్ నిర్మాణాలు, రోడ్డు విస్తరణ, లైటింగ్, ఇతర ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్ పాల్గొన్నారు.


