పార్టీలో చర్చించి పొత్తుపై నిర్ణయం
మెట్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మెట్పల్లిలో హంగ్ ఫలితాలు రావడం నిరాశకు గురిచేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్, బీజేపీ రెండు సమాన దూరమన్నారు. హంగ్ వచ్చినందున పొత్తు ఆలోచన తమకు ఎంతమాత్రమూ లేదని, అభివృద్ధి కోసం పొత్తు తప్పదనుకుంటే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రెండున్నరేళ్లుగా మున్సిపాలిటీలు అభివృద్ధిపరంగా వెనుకబడిపోయాయన్నారు. ప్రస్తు తం రెండు పట్టణాల్లో ఏర్పడే పాలకవర్గాలు అభివృద్ధికి కృషి చేయాలని, ఇందుకు తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు దశరథరెడ్డి, ఆకుల ప్రవీణ్, తిరుపతిరెడ్డి తదితరులున్నారు.
అంజన్న సన్నిధిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సతీమణి పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య శనివారం కుటుంబసభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ ఏఈఓ హరిహరనాథ్, పర్యవేక్షకులు సునీల్ కుమార్ పాల్గొన్నారు.
ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావా ణి కార్యక్రమాన్ని వచ్చే సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్న ట్లు పేర్కొన్నారు. కోడ్ ముగియగానే ప్రజా వాణి యథాతథంగా నిర్వహిస్తామన్నారు.
సాంబశివాలయంలో గీతాయజ్ఞం
బుగ్గారం: మండలంలోని అర్సికోట అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీసాంబశివనాగేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గీతాహవన యజ్ఞం నిర్వహించారు. గీతాధర్మప్రచారకేంద్రం వ్యవస్థాపకులు శ్రీహరిమౌనస్వామి ఆధ్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు కుంకుమపూజ చేశారు. ఆదివారం స్వామివారి కల్యాణం ఉంటుంది. సాయంత్రం శోభాయాత్ర ఉంటుందని వేదపండితులు కంచర్ల శివశంకరాచార్య, తిప్పర్తి అనిల్శాస్త్రి, వేమునూరి రాజేశ్ తెలిపారు. సోమవారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మసర్తి రాజిరెడ్డి, సర్పంచ్ నక్క రాజ వ్వ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
జగిత్యాలక్రైం: వాలెంటైన్స్ డే సందర్భంగా గిఫ్ట్చార్జీలు, వ్యక్తిగత అవసరాల పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు అడుగుతారని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ వెంకటరమణ అన్నారు. గిఫ్టులు, జ్యువెలరీ ఆఫర్లు, ఈవెంట్ టికెట్లు పేరుతో లింకులు పంపి.. నకిలీ చెల్లింపు పేజీలకు తీసుకెళ్లి డబ్బు దోచుకుంటారని, ప్రమాదకర యాప్లు ఇన్స్టాల్ అయ్యేలా చేస్తారని పేర్కొన్నారు. అజ్ఞాత లింకులు క్లిక్ చేయొద్దని, ఓటీపీ లేదా బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని సూచించారు. ప్రమాదకర యాప్ల ద్వారా వ్యక్తిగత సమాచారం, కాంటాక్టులు, బ్యాంకు వివరాలు కూడా దొంగిలించే అవకాశం ఉందన్నారు. మోసపోయినట్లు తెలియగానే 1930కు కాల్ చేయాలని, www.cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. తొందరగా ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పార్టీలో చర్చించి పొత్తుపై నిర్ణయం


