మహా శివరాత్రికి ముస్తాబైన ఆలయాలు
జగిత్యాలరూరల్/మల్లాపూర్/రాయికల్/వెల్గటూర్: జిల్లాలోని శైవక్షేత్రాలు మహా శివరాత్రికి ముస్తాబయ్యాయి. జగిత్యాల మండలం పొలాసలోని పౌలస్తేశ్వరస్వామి, సహస్రలింగాలయం, పొరండ్ల రామలింగేశ్వరస్వామి, జాబితాపూర్లోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయాలను ముస్తాబు చేశారు. ఏర్పాట్లను ఈవో సంగెం సురేందర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ పరిశీలించారు. మల్లాపూర్ మండలకేంద్రంలోని సోమేశ్వరస్వామి ఆలయాన్ని అందంగా అలంకరించారు. కొండపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున రానున్నారు. జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సంగ గంగరాజం తెలిపారు. వెల్గటూర్లోని కోటిలింగాల కోటేశ్వరాలయం ముస్తాబయింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా చలువ పందిల్లు, మంచినీటి సౌకర్యం కల్పించారు. గోదావరిలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్ తెలిపారు. రాయికల్ మండలంలోని కొత్తపేట రాజరాజేశ్వరస్వామి నాగాలయం, అల్లీపూర్, కుమ్మరిపల్లి, ధర్మాజీపేట గ్రామాల్లోని శివాలయాలు, చెన్నకేశవనాథ
ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.


