
మహిళలకు భరోసా
● దివ్యాంగులు, కిశోర బాలికలతో గ్రూపుల ఏర్పాటు ● బ్యాంక్ల నుంచి లింకేజీ రుణాలు ఇచ్చేలా చర్యలు ● యాక్షన్ ప్లాన్ తయారుచేస్తున్న అధికారులు
జగిత్యాల: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. అలాగే మహిళాసంఘాలను బలోపేతం చేసి వారు ఆర్థిక సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో ఇందిర మహిళాశక్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికలకు కొత్తగా మహిళాసంఘ గ్రూపులు ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ బ్యాంక్ రుణాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, బాలికలు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహిళ సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు 60 ఏళ్లు దాటితే వారిని గ్రూపులోంచి తొలగించారు. ప్రస్తుతం ఉన్నవారిని అలాగే ఉంచాలని, లేకుంటే వారికి ఒక ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, బాలికల్లో ఆనందం
గతంలో 60 ఏళ్లు దాటాయంటే గ్రూపు నుంచి తొలగించారు. దీంతో వారు పొదుపు చేసుకునే అవకాశం కోల్పోయారు. వృద్ధులు కావడంతో వారికి బ్యాంక్ రుణాలు ఇవ్వలేమని అప్పుడు రిజెక్ట్ చేశాయి. తాజాగా ప్రభుత్వం కచ్చితంగా వృద్ధులకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ మహిళాసంఘాల ఆధ్వర్యంలో కొత్తగా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరితోపాటు 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న బాలికలతో కూడా సంఘాలను ఏర్పాటు చేసి వారికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. వీరితోపాటు, సామాజిక మాద్యమాల మోసాలు, అత్యాచారాలు, ఇతరత్రా అంశాలపై వారికి చైతన్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గ్రామంలో 12 మంది ఉంటే వారందరికీ ఒక గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. లేకుంటే వేరే సంఘాల్లో ఉంటారు. వీరందరికీ బ్యాంక్ రుణాలు అందించి వారిని ఆర్థిక సాధికారత సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
కార్యాచరణ..
ఈనెల 12 నుంచి 14వరకు గ్రామాల వారిగా జాబితా రూపొందించి మహిళాసంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, బాలికలను గుర్తిస్తారు. 14 నుంచి 15 వరకు వారికి సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరించనున్నారు. బ్యాంక్ రుణాలు అందుతాయని చెప్పి వారిని గ్రూపులో చేర్పించేలా చూస్తారు. 15 నుంచి 30 వరకు సంఘాల్లో చేరిన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేసి రుణాలు అందిస్తారు. వీరికి సంబంధించిన వివరాలన్నింటినీ సెర్ప్ వెబ్సైట్లో నమోదు చేస్తారు.
రుణాలు అందజేత
ఈ సంఘాలను రూపొందించిన అనంతరం మహిళాసంఘాలను సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి రుణాలు సైతం మంజూరు చేయనున్నారు. రీవాల్వింగ్ ఫండ్ను ఖాతాల్లో జమచేస్తారు.
మహిళల
సాధికారతే లక్ష్యం
జిల్లాలో మహిళా సంఘాలు 15019
మొత్తం సభ్యులు 177250
గ్రామైక్య సంఘాలు 565
మండల సమైక్యలు 18
జిల్లా సమైక్య 1
మహిళలు సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో కొత్తగా మహిళాసంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో నూతనంగా వృద్ధులు, దివ్యాంగులకు, బాలికలతో గ్రూపులు ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నాం. వీరికి బ్యాంకు నుంచి లింకేజీ రుణాలు అందిస్తాం.
– రఘువరణ్, డీఆర్డీఏ పీడీ

మహిళలకు భరోసా