
నీళ్లు రాకున్నా.. బిల్లు మోత!
మెట్పల్లి:
పట్టణాల్లో నల్లాల ద్వారా సరఫరా చేసే నీటికి ప్రజలు మున్సిపాలిటీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నల్లాలు ఉండి.. నీళ్లు రాకపోయినప్పటికీ మెట్పల్లి మున్సిపాలిటీలో పలువురికి బిల్లులు రావడం విమర్శలకు దారి తీస్తోంది. మిషన్ భగీరథ కింద నల్లాలు బిగించినప్పటికీ చాలా ఇండ్లకు ఏళ్లు గడిచినా నీళ్లు రావడం లేదు. అయినా రూ.వేలల్లో బిల్లులు రావడంతో బాధితులు అందోళన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆన్లైన్ పేరుతో జాప్యం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
26 వార్డులు.. 10,928 నల్లా కనెక్షన్లు
మెట్పల్లి పట్టణంలో 26వార్డులు ఉండగా, 10,928 నివాసాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. డబ్బాలోని రిజర్వాయర్ నుంచి వచ్చే మిషన్ భగీరథ నీటిని ప్రజలకు అందిస్తున్నారు. ప్రతీ రోజు సుమారు 90లక్షల లీటర్లను సరఫరా చేస్తున్నారు. ఇందుకు గాను ఒక్కో ఇంటికి నెలకు రూ.200 చొప్పున ఏడాదికి రూ.2,400 నల్లా పన్నును మున్సిపాలిటీ వసూలు చేస్తోంది. మిషన్ భగీరథ కింద రెండేళ్ల క్రితం వరకు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చారు. ఇందులో ఇప్పటికీ కొన్ని వందల కుటుంబాలకు నీళ్లు రావడం లేదు. వాళ్లందరికీ బోరు నీళ్లే దిక్కయ్యా యి. డబ్బా రిజర్వాయర్ నుంచి అవసరం మేరకు నీరు సరఫరా కాకపోతుండడంతో ఇండ్లకు నీరు అందించడం లేదు. ఆయా కుటుంబాలకు నల్లా పన్నును మాత్రం లెక్కకట్టి వేయడంతో వారంతా అందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం బాలకృష్ణనగర్వాసులు అధికారులను కలిసి తమ బిల్లుల రద్దు చేయాలని కోరగా, అప్పటి పాలకవర్గం దీనికి అమోదం తెలుపుతూ తీర్మానం చేసింది. అయినా ఇప్పటివరకు వారి బిల్లులు రద్దు కాలేదు.
ప్రజల్లో అసంతృప్తి
ఒత్తిడి చేయడం లేదు
గతంలో కొందరి ఇళ్లలో నల్లాలు తొలగించినప్పటికీ..కొందరి ఇండ్లల్లో నల్లాలు ఉండి నీళ్లు రాకపోయినప్పటికీ బిల్లులు వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం నల్లా బిల్లులన్నీ ఆన్లైన్ కావడం వల్ల వాటిని రద్దు చేయడం ఇక్కడ సాధ్యం కాదు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోయాం. అలాంటి వారిని బిల్లుల కోసం ఒత్తిడి చేయడం లేదు.
– నాగేశ్వర్రావు, డీఈఈ
భగీరథ కింద ఇంటింటా నల్లా కనెక్షన్లు
రెండేళ్లు గడిచినా సరఫరా కాని నీరు
అయినా రూ.వేలల్లో బిల్లులు
లబోదిబోమంటున్న ప్రజలు
‘మెట్పల్లి పట్టణంలోని 19వార్డుకు చెందిన సాంబారి సుధాకర్ ఇంట్లో మిషన్ భగీరథ కింద కొంతకాలం క్రితం నల్లా బిగించారు. ఇంతవరకు దాని ద్వారా ఒక్కచుక్క నీరు రాలేదు. అయినా రూ.10వేల పైనే నల్లా బిల్లు బకాయి ఉందంటూ మున్సిపల్ సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యాడు.’
‘పట్టణంలోని బాలకృష్ణనగర్ శివారులో ఉన్న 27 ఇండ్లకు భగీరథ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చినప్పటికీ నీళ్లు మాత్రం రావడం లేదు. అయినప్పటికీ వారందరికీ రూ.వేలల్లో బిల్లులు రావడంతో ఖంగుతిన్నారు. అధికారులను కలిసి విన్నవించుకున్నప్పటికీ అవి రద్దు కాలేదు.’
జిల్లాలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా మెట్పల్లిలో నల్లా బిల్లు అధికంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగతా మున్సిపాలిటీల్లో నెలకు రూ.100 చొప్పున వసూలు చేస్తుంటే..మెట్పల్లిలో మాత్రం రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆదాయం పెంచుకునే క్రమంలో పాలకవర్గం అమోదంతో ఈ నిర్ణయం తీసుకున్న స్థానిక అధికారుల తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నీళ్లు రాకున్నా.. బిల్లు మోత!