
మామిడి మార్కెట్లో అవకతవకలు
● పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలి ● డీఎంవోను ప్రాసిక్యూట్ చేయాలి ● మాజీ మంత్రి జీవన్రెడ్డి
జగిత్యాలటౌన్: మార్కెటింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మార్కెటింగ్ శాఖ కనుసన్నల్లో జరగాల్సిన ఓపెన్ యాక్షన్ ట్రేడర్ల ఇష్టారాజ్యంగా మారిందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. ట్రేడ ర్ల చేతిలో రైతులు నష్టపోతున్నా పట్టించుకోని జిల్లా మార్కెటింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని, పదేళ్లకుపైగా ఇక్కడే ఉంటున్న అతడిని వెంటనే బదిలీ చేయాలని సూచించారు. మామిడి రైతులు నష్టపోతున్నా నిబంధనలు అమలు చేయడంలో విఫలమవుతున్న సదరు అధికారిని విచారణ చేపట్టాలన్నారు. ఈ మేరకు కలెక్టర్కు లేఖ రాశారు. సూట్ పేరుతో 5శాతం తరుగు, రాట్ గ్రేడింగ్ పేరుతో మరో 5శాతం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై పర్యవేక్షించినట్లుగానే మామిడి కొనగోళ్లపైనా కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు. ప్రతి ట్రేడర్ బహిరంగ వేలం ద్వారానే మామిడి కొనాలన్న మార్కెటింగ్ శాఖ నిబంధన అమలు చేయాలన్నారు. 4శాతానికి కంటే ఎక్కువ మార్కెటింగ్ ఫీజు వసూలు చేస్తూ రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, రాజేందర్, రాజేందర్, మహ్మద్ భారీ, మన్సూర్, గుంటి జగదీశ్వర్, రఘువీర్గౌడ్, మధు పాల్గొన్నారు.