
వాషింగ్టన్: అమెరికాలోని డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా కొన్ని హెచ్చరికలు చేసింది.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను మళ్లీ ప్రారంభించింది. ఈ సందర్భంగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. సోషల్ మీడియా పోస్టులు.. వీసాలపై ప్రభావం చూపిస్తాయని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల విషయమై విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ..‘ఈ సోషల్ తనిఖీలతో అమెరికాలో వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా(సోషల్ మీడియా వెట్టింగ్) ఖాతాలను యూఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేటు సెట్టింగ్స్ను మార్చుకుని ‘పబ్లిక్’ ఆప్షన్ పెట్టుకోవాలి. దీని బట్టే సదరు విద్యార్థులకు వీసా అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే అంచనా వేయవచ్చు’ అని చెప్పుకొచ్చారు. కాగా, సోషల్ మీడియా వెట్టింగ్ అంటే.. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా.. లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు.
U.S. to resume processing foreign student visas, will review applicants onlineThe United States will resume processing visas for foreign students and has notified U.S. embassies and consulates abroad that all #US #Visa #Harvard #Foreign students pic.twitter.com/WvlZHKVmpQ
— Emily Johnson (@djdfresh72) June 19, 2025
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మే చివరి వారం నుంచి విదేశీ విద్యార్థుల ఇంటర్వ్యూలను అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. కొత్తగా వీసాలను దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే, వీసాలు ఇచ్చేందుకు సదరు విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాల్సి ఉందని.. అందుకే వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా మళ్లీ వీసాల అమలు ప్రక్రియను ప్రారంభించినట్టు చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియా ఖాతాపై నజర్..
వీసాలు ఇచ్చే విషయంలో సంబంధిత విద్యార్థుల ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ధరించుకున్న తర్వాతే వారికి వీసా లభిస్తుంది. ఇజ్రాయెల్, పాలస్తీనాకు మద్దతు తెలిపిన విద్యార్థులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది.