కొత్త హెచ్1–బీ వీసాలపై ట్రంప్ నిర్ణయం
అధికారిక ఉత్తర్వులు జారీ
వీసా పరిశీలన మరింత కఠినం
వాషింగ్టన్: కొత్త హెచ్1–బీ వీసా దరఖాస్తులపై ఇంకో ఏడాది లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. ప్రభుత్వ విభాగాలు మరింత సమన్వయంతో పనిచేయడం ద్వారా హెచ్1–బీ వీసాల దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని ట్రంప్ మరో ఉత్తర్వు ద్వారా ఆదేశించారు.
2025లో మొదటిసారి లక్ష డాలర్ల ఫీజును ప్రవేశపెట్టాక ఐటీ ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచి వచ్చే హెచ్1–బీ వీసా దరఖాస్తులు 92 శాతం వరకూ తగ్గాయని ట్రంప్ తాజా ఉత్తర్వుల్లో తెలిపారు. అమెరికా ఆర్థిక, భద్రతపరమైన ప్రయోజనాలను కాపాడేందుకు గత ఏడాది నాటి ఈ ఉత్తర్వులను పొడిగించడం అవసరమైందని స్పష్టం చేశారు.
అమెరికన్ ఉద్యోగులు, పట్టభద్రుల ఉద్యోగ అవకాశాలకు, కంపెనీలు అత్యధిక నైపుణ్యం అవసరమైన విదేశీయులను మాత్రమే నియమించుకునేలా చేసేందుకు ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయని వివరించారు. హెచ్1– బీ వీసాల లబ్ధి అత్యధికంగా పొందుతున్నది భారతీయ టెకీలన్న విషయం తెలిసిందే.
2025లో ట్రంప్ హెచ్1–బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినప్పుడు కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రెండు ఫెడరల్ కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. నాటి ఉత్తర్వుల కాలపరిమితి ఈ నెలతో ముగియనుండగా తాజా ఆదేశాలు వెలువడటం గమనార్హం.
అయితే ఈ లక్ష డాలర్ల ఫీజు అనేది అమెరికాలో విద్యార్థి వీసాలపై ఉన్న వారికి, ప్రస్తుతం హెచ్1–బీ వీసాపై ఉన్న వారి రెన్యువల్కూ వర్తించదు. ఈ వీసాదారుల వేతనాలు, పని నిబంధనలకు సంబంధించి కంపెనీ ఇప్పటికే సమర్పించిన లేబర్ కండిషన్ అప్లికేషన్ల సమాచారాన్ని 30 రోజుల్లో సమీక్షించాలని, అనంతరం స్పాన్సర్ చేసే సంస్థలపై మరిన్ని చర్యలు అవసరమా? లేదా? అన్నది నిర్ణయించాలని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.


