ఇది ఆరంభమే.. అసలు కథ ముందుంది: ట్రంప్‌ | US President Donald Trump Comments In US Congress Joint session | Sakshi
Sakshi News home page

ఇది ఆరంభమే.. అసలు కథ ముందుంది: ట్రంప్‌

Mar 5 2025 8:54 AM | Updated on Mar 5 2025 9:07 AM

US President Donald Trump Comments In US Congress Joint session

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రజలు తనను ఎన్నుకున్నట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన ఆరు వారాల్లోనే వందకు పైగా సంతకాలు చేసినట్టు ట్రంప్‌ తెలిపారు.

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్‌ తొలిసారి కాంగ్రెస్‌ సంయుక్త సెషన్‌లో ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్‌ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో వివరించారు. ఈ క్రమంలో ట్రంట్‌ మాట్లాడుతూ..‘ఆరు వారాల్లో వందకు పైగా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకాలు చేశాను. నాలుగేళ్లు, ఎనిమిదేళ్లలో సాధించిన దానికంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్టు అనిపిస్తోంది. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగి వచ్చింది. ఈ పని చేయడానికి అమెరికా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు.. చేసుకుంటూ పోతున్నాను. త్వరలోనే అమెరికన్ల కల నిజం కాబోతుంది. గతంలో కంటే మెరుగైన జీవితం వారికి లభిస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. 

ఇతర దేశాలు దశాబ్దాలుగా మనపై సుంకాలను విధిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇతర దేశాలపై వాటిని ఉపయోగించడం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్‌, ఇతర దేశాలు మనం వసూలు చేసే దాని కంటే చాలా ఎక్కువ సుంకాలను మన నుండి వసూలు చేస్తాయి. ఇది చాలా అన్యాయం. భారత్‌ మన నుండి ఆటో సుంకాలను 100% వసూలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరస్పర సుంకాలు ప్రారంభమవుతాయి. వారు మనపై ఎలాంటి సుంకాలు వేస్తారో.. మనం వాటిపై అంతే సుంకాలు విధిస్తాం అని చెప్పారు.

అమెరికాలో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాన్ని తిప్పికొట్టి అమెరికాను మళ్లీ రేసులోకి తీసుకురావడానికి నేను ప్రతిరోజూ పోరాడుతున్నాను. అలాగే, సరిహద్దుల నుంచి అక్రమ వలసలు కూడా ఆగిపోయాయి అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

ఇదిలా ఉండగా.. అంతకుముందు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. ట్రంప్‌ వస్తున్న సమయంలో అమెరికా, అమెరికా, అమెరికా అంటూ నినాదాలు చేశారు. దీంతో, సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement