గనులు కుప్పకూలడంతో 200 మంది కార్మికుల సజీవ సమాధి
తూర్పు కాంగో గనుల్లో పెను విషాదం
గోమా: డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రకృతి విలయానికి 200 మంది కార్మికులు బలయ్యారు. ఈ వారంలో ఉత్తర కివూ ప్రావిన్స్లో కొండచరియలు విరిగిన పడటంతో బలహీనపడిన గనులు బుధవారం కుప్పకూలడంతో భూగర్భంలో విధుల్లో ఉన్న 200 మందికిపైగా కార్మికులు సజీవసమాధి అయ్యారు. రుబాయా మైన్స్గా పిలబడే ఆ ప్రాంతంలోని గనుల ముఖద్వారాలన్నీ కుప్పకూలాయి. దీంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని నార్త్కివూ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి లుముంబా కంబేరే ముయీసా ప్రకటించారు.
రుబాయా గనుల్లో ముఖ్యంగా కోల్టన్ ముడి ఖనిజం కోసం తవ్వకాలు జరుపుతారు. కొలంబైట్ టాంటలైట్గా పిలిచే ఈ అత్యంత విలువైన లోహాన్ని అత్యాధునిక ఎల్రక్టానిక్స్లో ఉపయోగిస్తారు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, ఆటోమోటివ్ ఎల్రక్టానిక్స్, విమాన ఇంజిన్లు, కంప్యూటర్లలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన కెపాసిటర్లలో కోల్టన్ ముడి ఖనిజాన్ని వాడతారు. మొత్తం ప్రపంచ కోల్టన్ అవసరాల్లో 15 శాతం ఖనిజం కేవలం ఈ గనుల నుంచి వెళ్తోంది.
దీంతో అత్యధిక లాభాలు గడించాలనే దుర్బుద్ధితో సరైన రక్షణ ఏర్పాట్లు లేకుండానే పేద కార్మికులను ప్రమాదకర గనుల్లోకి పంపించి గంటల తరబడి పనిచేయిస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు ఎం23 అనే తిరుగుబాటుదారుల చేతుల్లో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాని పర్యవసానంగా గనులు కూలాయని తిరుగుబాటుదారుల ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇంకా కొందరు ఆ బురదల్లో కూరుకుపోయి ఉంటారు. గాయపడిన వారిని సమీప రుబాయా పట్టణ ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నాం. గోమా పట్టణ ఆస్పత్రుల్లోనూ పలువురిని చేర్పించాం. గనుల సమీప శిబిరాలను తక్షణం ఖాళీ చేయించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం’’అని ముయీసా చెప్పారు.

చేతులతోనే తవ్వకం, అధ్వాన ఏర్పాట్లు..
ఆ గనుల్లో సురక్షిత పరిస్థితులు అనేవే ఉండవని అక్కడ గతంలో పనిచేసిన కార్మికుడు చెప్పాడు. ‘‘ఎలాంటి భారీ యంత్రాలు లేకుండా మైనింగ్ జరుగుతుంది. కార్మికులు ఉత్త చేతులతో చిన్న పనిముట్లతో తవ్వకాలు చేస్తారు. గని పైకప్పు కూలకుండా పటిష్టమైన తాత్కాలిక నిర్మాణాలు ఏమీ ఉండవు. గనుల నిర్వహణ అధ్వానంగా ఉంటుంది. సమాంతరంగా గనులను తవ్వుతారు. దీంతో ఒక్కటి కూలితే మిగతావన్నీ కూలడం ఖాయం’’అని క్లోవిస్ మఫేర్ అనే మాజీ కార్మికుడు చెప్పారు. మధ్య ఆఫ్రికా దేశమైన తూర్పు కాంగోలో రుబాయా ప్రాంతం అత్యంత కీలకమైంది. ఇక్కడ దశాబ్దాలుగా హింస రాజ్యమేలుతోంది. సమీప రువాండా దేశ దన్నుతో ఎం23 తిరుగుబాటుదారులుసహా పలు రెబల్ గ్రూప్లు ప్రభుత్వ సాయుధ బలగాలతో తరచూ ఘర్షణలకు దిగుతూ రక్తపుటేరులు పారిస్తున్నాయి. అంతర్యుద్ధం కారణంగా దశాబ్దాల్లో తూర్పు కాంగో నుంచి 70 లక్షల మంది జనం తమ సొంతూళ్లను వదిలి వెళ్లిపోయారు. ఒక్క ఈ జనవరిలోనే మరో లక్ష మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.


