ద హేగ్: ప్రాణాంతకర హంటావైరస్ గుప్పిట చిక్కిన విలాసవంత విహారనౌక ‘ఎంబీ హోండియస్’నుంచి డజను మందికిపైగా పర్యాటకులకు విముక్తి లభించింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వాళ్లకు వైరస్ సోకలేదని రూఢీ చేసుకున్నాక 12 దేశాలకు చెందిన డజను మందికిపైగా ప్రయాణికులను నౌక నుంచి సురక్షితంగా బయటకు పంపేశామని నౌక యాజమాన్యం, నెదర్లాండ్స్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
అయితే లక్షణాలు కనిపించనంత మాత్రాన నౌకలోని ప్రయాణికులను స్వేచ్ఛగా వదిలేస్తారా? వాళ్లు స్వదేశాలకు వచ్చాక వాళ్లలో వైరస్ లక్షణాలు బయటపడి ఇతరులకు వ్యాపిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న అనుమానాలు, భయాందోళనలు ఎక్కువయ్యాయి. నౌకలోకి ఎక్కకముందు విమానంలో ప్రయాణించిన ఒక మహిళలో హంటావైరస్ లక్షణాలు వెలుగుచూశాయి.
ఈమెకు ఆ విమానంలో సేవలందించిన మహిళా ఫ్లయిట్ అటెండెంట్ను ప్రస్తుతం క్వారంటైన్లో ఉంచామని, లక్షణాలు ఆమెలో ఇంకా కని్పంచలేదని నెదర్లాండ్స్ వైద్యశాఖ తెలిపింది. ఏప్రిల్ 24వ తేదీన నౌకలో తొలిసారిగా వైరస్ జాడను గుర్తించిన విషయం తెల్సిందే. అయితే మార్గమధ్యంలో నౌక పలు దేశాల్లో లంగరువేయడం, అక్కడ కొందరు ప్రయాణికులు దిగిపోయిన నేపథ్యంలో ఎంతమందికి వైరస్ సోకి ఉండొచ్చనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టతలేదు.
దీంతో ప్రయాణం మొదలెట్టిన రోజు నుంచి వైరస్ వెలుగుచూసిన రోజుదాకా ఎంత మంది ఎక్కడెక్కడ దిగిపోరనే వివరాలతో వాళ్ల జాడను కనిపెట్టి వైద్యపరీక్షలు చేయడంలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈలోపు ఈ విషయం తెలియక వాళ్లు స్థానికంగా ఇంకెంత మందికి వైరస్ను వ్యాపింపజేస్తారో అనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి.


