అప్పటి, ఇప్పటి పరిస్థితులేంటి? : మోదీ | Sakshi
Sakshi News home page

అప్పటి, ఇప్పటి పరిస్థితులేంటి? : మోదీ

Published Sat, Sep 26 2020 7:07 PM

PM Modi Speech Addressing UN General Assembly Through Online - Sakshi

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత్‌కు ఐక్యరాజ్యసమితి మరింత పెద్దపీట వేయాలని కోరారు. భారత్‌ ఎల్లప్పుడూ విశ్వశాంతి కోసం కృషి చేస్తోందని అన్నారు. ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఆన్‌లైన్‌ ద్వారా మోదీ ప్రసంగించారు. ‘ప్రస్తుతం మనం భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాం. సరికొత్త సవాళ్లను ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతోంది. ఐక్యరాజ్యసమితి చేయగలిగినంత చేస్తోందా?’అని మోదీ సందేహం వెలిబుచ్చారు.

కోవిడ్‌ వాక్సిన్లను వేగంగా తయారు చేసేందుకు భారత ఫార్మా సిద్ధంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇవాళ ఐక్యరాజ్యసమితి అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని అన్నారు. 1945లో ఐరాస ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులేంటి.. ఇప్పుడు పరిస్థితులేంటి? అని మోదీ ప్రశ్నించారు. ఐరాసలో సంస్కరణల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. 21వ శతాబ్దంలోని సవాళ్లకు అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు రావాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో సమూల ప్రక్షాళన జరగాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు.
(చదవండి: కరోనా పాపం చైనాదే)

Advertisement

తప్పక చదవండి

Advertisement