మిలటరీ గుప్పెట్లో మయన్మార్‌ 

Myanmar Country In Hands Of Military - Sakshi

నేపిదా: స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే బర్మాలో ప్రజాస్వామ్యం కనిపించింది. అధిక కాలం మిలటరీ గుప్పెట్లోనే బర్మా గడిపింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మయన్మార్‌లో జరిగిన కీలక సంఘటనల సమాహారం పరిశీలిస్తే.. 

  • 1948, జనవరి 4: బర్మాకు బ్రిటీష్‌ వారినుంచి స్వాతంత్రం లభించింది.  
  • 1962: మిలటరీ నేత నీ విన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనా పగ్గాలు చేపట్టారు. 
  • 1988: ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆంగ్‌సాన్‌ సూకీ విదేశీ ప్రవాసం నుంచి స్వదేశానికి వచ్చారు. దేశంలో జుంటా(మిలటరీ సమూహం)పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో జరిగిన నిరసనలపై మిలటరీ కాల్పులు జరపగా వందలాది మంది మరణించారు. 
  • 1989, జూలై: జుంటాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సూకీని హౌస్‌ అరెస్టు చేశారు. 
  • 1990, మే 27: ఎన్నికల్లో సూకీ పార్టీ ద నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ బంపర్‌ మెజార్టీ సాధించింది. కానీ పాలనా పగ్గాలు అందించేందుకు జుంటా నిరాకరించింది.  
  • 1991, అక్టోబర్‌: సూకీకి శాంతియుత పోరాటానికిగాను నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది. 
  • 2010, నవంబర్‌ 7: ఇరవై సంవత్సరాల తర్వాత జరిపిన ఎన్నికల్లో జుంటా అనుకూల పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి.  
  • 2010, నవంబర్‌ 13: దశాబ్దాల హౌస్‌ అరెస్టు అనంతరం సూకీ విడుదలయ్యారు. 
  • 2012: పార్లమెంట్‌ బైఎలక్షన్‌లో సూకీ విజయం సాధించారు. 
  • 2015, నవంబర్‌ 8: సూకీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కీలక పదవులను జుంటా తన చేతిలో ఉంచుకొని సూకీకి స్టేట్‌ కౌన్సిలర్‌ పదవి కట్టబెట్టింది.  
  • 2017, ఆగస్టు 25: రోహింగ్యాలపై మిలటరీ విరుచుకుపడింది. దీంతో వేలాదిమంది బంగ్లాదేశ్‌కు పారిపోయారు.  
  • 2019, డిసెంబర్‌ 11: జుంటాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో సూకీ తమ మిలటరీకి మద్దతుగా నిలిచారు. 
  • 2020, నవంబర్‌ 8: ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్‌ఎల్‌డీకి మరోమారు మెజార్టీ దక్కింది. 
  • 2021, జనవరి 29: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న జుంటా ఆరోపణలను బర్మా ఎన్నికల కమీషన్‌ తోసిపుచ్చింది. ఇందుకు సరైన ఆధారాల్లేవని తెలిపింది. 
  • 2021, ఫిబ్రవరి 1: దేశాన్ని ఒక సంవత్సరం పాటు ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మిలటరీ ప్రకటించింది. ఓటింగ్‌ అక్రమాలపై సూకీ ప్రభుత్వ స్పందన పేలవంగా ఉందని, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని సూకీ పట్టించుకోలేదని ఆరోపించింది. మరోమారు సూకీని హౌస్‌ అరెస్టు చేస్తున్నట్లు తెలిపింది.  
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top