టెహ్రాన్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్న తరుణంలో మోజ్తాబా ఖమేనీ ఇస్లాం కంట్రీస్కు కీలక సూచన చేశారు. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని దేశాలకు మోజ్తాబా లేఖ రాశారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలోని ముస్లిం దేశాలతో ఇరాన్కు తీవ్ర స్థాయిలో విభేదాలు ఏర్పడ్డాయి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు గల్ప్ కంట్రీస్ సహాకరిస్తున్నాయని నెపంతో ఇరాన్ ఆదేశాలలోని అమెరికా స్థావరాలపై దాడులతో విరుచుకపడింది. దీంతో ఇరాన్పై గల్ఫ్ దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం మోజ్తాబా ఖమేనీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని లేఖ రాశారు.
మోజ్తాబా లేఖలో "ఏ పదవిలో ఉన్నవారైనా, తెలిసిగానీ తెలియకుండాగానీ, ఉద్దేశపూర్వకంగాగానీ అనుకోకుండాగానీ, ముస్లింల మధ్య విభజనకు, ముస్లిం సమాజంలో సంఘర్షణకు దారితీసే ఏ పని చేసినా, వారు ఇస్లాం శత్రువుల ప్రయోజనాలకు సేవ చేసినట్లే మీ నిజమైన శత్రువును గుర్తించండి, దాని ప్రణాళికను అర్థం చేసుకోండి, దాన్ని ఎదుర్కోండి" అని లేఖలో తెలిపారు. షియా ముస్లింలు ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్లను ఉద్దేశిస్తూ పరోక్షంగా ముస్లిం దేశాలకు సూచన చేశారు.సామాజిక సామరస్యానికి భంగం కలిగించే ఏ పనినైనా చేయడం నిషిద్ధమని తాను గట్టిగా ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. కాగా అమెరికా, ఇరాన్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఇరాన్ సుప్రీంగా బాధ్యతలు తీసుకున్న మోజ్తాబా ఇంతవరకూ ఎప్పుడు బహిరంగంగా కనిపించలేదు. ఇటీవల ఆయనకు సంబంధించిన ఒక వీడియోను ఇరాన్ విడుదల చేసినప్పటికీ అందులో ఉన్నది ఆయనా కాదా అనే విషయం తెలియలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖమేనీ పేరుతో ముస్లిం దేశాలకు లేఖ విడుదలైంది.


