
గాజా: ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ బలగాల క్రౌర్యం అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతోంది. గాజా దక్షిణ ప్రాంతంలోని ఖాన్యూనిస్ నగరంలోని రోడ్డుపక్కన ఆహారం ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై మంగళవారం జరిగిన కాల్పుల్లో ఏకంగా 70 మంది చనిపోగా 200 మందికిపైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఆర్మీ డ్రోన్లు, మెషీన్ గన్లు, ట్యాంక్ షెల్స్ను అన్నార్తులపైకి ఒక్కసారిగా పెద్దపెట్టున కురిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాగా, తమ వద్దకు తీసుకువచ్చిన క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మరణాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని నాస్సెర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రఫాలోని ఆహార పంపిణీ కేంద్రం వద్ద సోమవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో 38 మంది చనిపోవడం తెల్సిందే.
అమెరికా–ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద నిత్యం కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇజ్రాయెల్ కాల్పుల్లో మంగళవారం అత్యధికులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఆహార నిల్వలు హమాస్ శ్రేణుల చేతుల్లో పడకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని ఇజ్రాయెల్ అంటోంది. అయితే, నూతన పంపిణీ వ్యవస్థ గాజా ప్రజల అవసరాన్ని ఏమాత్రం తీర్చలేదని, ఇలాగే కొనసాగిస్తే పాలస్తీనియన్లు ఆకలి చావులు తీవ్రతరం కాక తప్పదని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది.