వీడియోలతో అమెరికా కవ్వింపు.. గల్ప్‌ దేశాలపై ఇరాన్‌ పంజా | Iran Serious Warning To USA Over Attacks | Sakshi
Sakshi News home page

దాడి వీడియోలతో అమెరికా కవ్వింపు.. గల్ప్‌ దేశాలపై ఇరాన్‌ పంజా

Jun 27 2026 9:21 AM | Updated on Jun 27 2026 10:32 AM

Iran Serious Warning To USA Over Attacks

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యలకు దిగడంతో ప్రాంతీయ భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి, దానికి అమెరికా చేపట్టిన ప్రతీకార వైమానిక దాడులు, అనంతరం ఇరాన్ స్పందనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

సమాచారం ప్రకారం, హార్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న ఎవర్‌ లవ్లీ అనే వాణిజ్య నౌకపై ఇటీవల డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనకు ఇరాన్ మద్దతు ఉన్న బలగాలే కారణమని అమెరికా ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈ దాడి జరిగిందని పేర్కొంటూ, అమెరికా మరోసారి ఇరాన్ తీరప్రాంతంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కొన్ని కీలక సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి.

అమెరికా దాడుల వీడియోలు విడుదల.. 
మరోవైపు.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై నిర్వహించిన సైనిక దాడులకు సంబంధించిన వీడియోలను అధికారికంగా విడుదల చేసింది. ఈ వీడియోల్లో అమెరికా యుద్ధ నౌకల నుంచి క్షిపణులు ప్రయోగించడం, ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించడం, అనంతరం భారీ పేలుళ్లు సంభవించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తీర ప్రాంతంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలపై ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్లు CENTCOM తెలిపింది. ఈ వీడియోల్లో అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల నుంచి వరుసగా క్షిపణులు దూసుకెళ్లడం, లక్ష్య ప్రాంతాలను తాకిన తర్వాత భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం కనిపిస్తోంది. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతను కాపాడేందుకు, తమ బలగాల రక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.

అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా దాడులు జరిపిందని ఆరోపించింది. అనంతరం, అమెరికా చర్యకు ప్రతిస్పందనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇతర అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడుల వల్ల ఎంత మేర నష్టం జరిగిందనే విషయంపై అమెరికా ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది.

ఈ పరిణామాలతో గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను కాపాడడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ జలసంధి గుండా రోజూ లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. అందువల్ల అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement