Bodycam Footage Shows US Cop Hit And Killed Indian Student In Jan 2023 - Sakshi
Sakshi News home page

పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి..

Jul 25 2023 9:35 AM | Updated on Jul 25 2023 10:28 AM

bodycam footage shows cop fatally hit indian student - Sakshi

అమెరికాలోని సీటెల్‌లో 2023 జనవరిలో పోలీస్ వాహనం ఢీకొని తెలుగు యువతి కందుల జాహ్నవి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇది అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ యువతి కుటుంబంలో విషాదం నింపింది. తాజాగా ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో కీలకంగా మారింది. నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరిగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతున్న జాహ్నవి గత జనవరి 23న రోడ్డు దాటుతుండగా ఆమెను ఒక పోలీస్ వాహనం ఢీకొంది. ఆ సమయంలో పోలీసుల వాహనంలో సీటెల్‌ పోలీస్ విభాగానికి చెందిన కెవిన్ డేవ్ ఉన్నారు.

కెవిన్ డేవ్ బాడీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను గమనిస్తే.. నాటి కారు స్పీడో మీటర్ గంటకు 74 మైళ్ల వేగాన్ని చూపుతోంది. అదే స్పీడ్‌లో వాహనం జాహ్నవిని థామస్ స్ట్రీట్ కూడలి వద్ద ఢీకొంది. ప్రమాదంలో గాయాలపాలైన ఆమెను వెంటనే స్థానికులు, పోలీసు అధికారులు హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో కెవిన్ ఓ ఎమర్జెన్సీ కాల్ మాట్లాడుతున్నట్లు సమాచారం. అందుకే అతను వాహనం సైరన్‌ను తగ్గించాడని తెలుస్తోంది. అయితే ఈ అత్యవసర పరిస్థితి గురించి ఆమెకు హెచ్చరించడంలో కెవిన్ విఫలమయ్యాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.

ఈ ఉదంతంపై కెవిన్ మాట్లాడుతూ ఆ సమయంలో తాను సైరన్ మోగించానని, అప్పుడు జాహ్నవి క్రాస్‌ వాక్‌లో ఉందన్నారు. తమ కారును చూసి కూడా ఆమె క్రాస్ వాక్ గుండా వేగంగా పరిగెత్తిందని కెవిన్ తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన ఆరు నెలల తర్వాత బాడీ క్యామ్‌లో రికార్డ్ అయిన నాటి ఘటన దృశ్యాలు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్య  అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లి సీటెల్‌ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేరారు. గత జనవరి 23న ఆమె కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
ఇది కూడా చదవండి: ఇన్ని చిరుకప్పలు ఎక్కడి నుంచి
 

Advertisement
 
Advertisement
Advertisement