
గొంతు మార్చి.. రూ.2 లక్షలు కాజేసి!
సాక్షి, సిటీబ్యూరో: ఉన్నతాధికారులు, పరిచయస్తులు, స్నేహితులు, బంధువుల ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకుని వారి మాదిరిగా చాటింగ్ చేస్తూ డబ్బు కాజేసిన ఉదంతాలు ఇదివరకు అనేకం చూశాం కదా! అయితే ఇప్పుడు సరికొత్తగా ‘వాట్సాప్ మిమిక్రీ’ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. లండన్లో నివసిస్తున్న ఓ వ్యక్తి గొంతును సైబర్ నేరగాళ్లు అనుకరిస్తూ నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసి రూ.2.05 లక్షలు కాజేశారు. ఈ మేరకు బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితుడి(27) స్నేహితుడు కొన్నేళ్లుగా లండన్లో విద్యనభ్యసిస్తున్నారు. గత నెల 22న బాధితుడికి +44 7961925094 నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. లండన్లో ఉన్న స్నేహితుడు పంపినట్లుగా అది ఉండటంతో బాధితుడు అప్రమత్తం అయ్యాడు. తన స్నేహితుడికి నేరుగా ఫోన్ చేసి సంప్రదించడానికి ప్రయత్నించాడు. అయితే ఆ నెంబర్ అందుబాటులో లేకపోవడంతో సాధ్యం కాలేదు. కొద్దిసేపటికి 8132883688 నెంబర్ నుంచి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు బాధితుడి స్నేహితుడి గొంతును అనుకరిస్తూ మాట్లాడారు. దీంతో తన స్నేహితుడే మాట్లాడుతున్నట్లు బాధితుడు భావించాడు. తాను లండన్ నుంచి హైదరాబాద్కు వస్తున్నట్లు అవతలి వ్యక్తి చెప్పాడు. కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ చేసిన నేరగాడు తాను ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కుకున్నట్లు తెలిపాడు. తన వద్ద విదేశీ కరెన్సీ ఉండటంతో ఆదాయపు పన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పాడు. కొద్దిసేపటికి కాల్ చేసిన మరో వ్యక్తి ఆదాయపు పన్ను అధికారిగా పరిచయం చేసుకున్నాడు.
క్లియరెన్స్ చార్జీలు చెల్లిస్తే..
రూ.55,500 క్లియరెన్స్ చార్జీలు చెల్లిస్తే స్నేహితుడిని విడిచిపెడతామని సైబర్ నేరగాడు చెప్పాడు. బాధితుడిని నమ్మించేందుకు ఓ నకిలీ రసీదును వాట్సాప్ ద్వారా పంపాడు. తన స్నేహితుడిని రక్షించాలనే ఉద్దేశంతో బాధితుడు ఈ మొత్తం చెల్లించాడు. ఆ తర్వాత మళ్లీ కాల్ చేసిన నేరగాడు మరో పన్ను పేరుతో ఇంకో రూ.1,50,000 బదిలీ చేయించుకున్నాడు. ఆపై మరోసారి కాల్ చేసి రూ.3,50,000 డిమాండ్ చేయడంతో బాధితుడు అనుమానించాడు. తన స్నేహితుడిని అతడి నెంబర్కు కాల్ చేసి సంప్రదించాడు. అలా తాను మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు ఆన్లైన్ ద్వారా సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు.
వాట్సాప్ మిమిక్రీతో ఫ్రాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు
లండన్లోని స్నేహితుడి పేరిట నగరవాసికి టోకరా