
నాంపల్లి కోర్టుకు ఎన్ఎస్యూఐ నేత
సిటీ కోర్టులు: గత ప్రభుత్వ పాలనలో విద్యార్థి సమస్యలపై పోరాటం చేసిన ఎన్ఎస్యూఐ నాయకులపై బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసు విచారణ మంగళవారం నాంపల్లిలోని మూడవ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. ఈ విచారణకు ఏ–1గా ఉన్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.వెంకటస్వామి హాజరు కాగా..ఆయన తరుఫున న్యాయవాది కురుమ నరేందర్ వకాలత్ దాఖలు చేశారు. ఏ–2గా ఉన్న ఎం.శివకుమార్ కోర్టుకు గైర్హాజరు కావడంతో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.
మద్యం మత్తులో
వాహనాలు ధ్వంసం
జీడిమెట్ల: ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏడు వాహనాలను ధ్వంసం చేసిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ వివరాల ప్రకారం..గాజులరామారం రోడామేసీ్త్రనగర్కు చెందిన అంజన్గౌడ్ కొద్దిరోజులుగా మానసికంగా సరిగా ఉండటం లేదు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పూటుగా మద్యం సేవించి స్థానిక మార్కండేయ నగర్లో తిరుగుతూ 4 బైకులు, రెండు కార్లు, ఒక ఆటో ధ్వంసం చేశాడు. అందులో కొన్ని వాహనాలకు నిప్పుపెట్టి తగులబెట్టాడు. ఇది గమనించిన బాధితులు జీడిమెట్ల పీఎస్లో ఫిర్యాదు చేయగా పోలీసులు అంజన్గౌడ్పై కేసు నమోదు చేశారు. కాగా సదరు వ్యక్తితో ప్రవర్తనతో భయంగా ఉందని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంట్లో పార్కు చేసిన ద్విచక్రవాహనాలు దగ్ధం
ఉప్పల్: బోనాల పండుగకు వెళ్లి వచ్చే సరికి ఇంట్లో పార్కు చేసిన ద్విచక్ర వానాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన సంఘటన రామంతాపూర్ ఇందిరానగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి పాత బస్తీలో బోనాల పండుగకు బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం రాత్రి ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ఆవరణలోకి చొరబడి దిచక్రవాహనాలకు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఇంటికి వచ్చి చూసి..ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా..ఇద్దరు వ్యక్తులు కన్పించారని, వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
పదేళ్ల బాలికపై లైంగికదాడి
శంషాబాద్: శంషాబాద్ పట్టణంలో మంగళవారం తెల్లవారు జామున దారుణం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో ఓ పదేళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. యాచకులైన ఇద్దరు దంపతులు తమ పదేళ్ల కుమార్తెతో కలిసి పట్టణంలోని ఫ్లైఓవర్ కింద తలదాచుకుంటున్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి ఇటీవల ఉపాధి కోసం వచ్చిన ఇర్ఫాన్ హుస్సేన్ మద్యం మత్తులో మంగళవారం తెల్లవారు జామున ఫ్లైఓవర్ వద్దకు వచ్చి..అక్కడ నిద్రిస్తున్న బాలికను పక్కకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం గమనించిన కొందరు స్థానికులు, తల్లిదండ్రులకు చెప్పగా..వారు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజు తెలిపారు.
లారీ ఢీకొనడంతో
పల్టీకొట్టిన కారు
మియాపూర్: జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన లారీ వెనుక నుండి కారును ఢీకొట్టడంతో డివైడర్కు తాకి తలకిందులుగా పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. మియాపూర్ ఎస్ఐ చంద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం..చందానగర్లోని అపర్ణ హిల్ పార్క్లో నివాసం ఉంటున్న తన్మయ్ మియాపూర్ నుండి చందానగర్లోని తన ఇంటికి కారులో జాతీయ రహదారిపై వెళ్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మదీనాగూడ అంకుర్ ఆసుపత్రి వద్దకు రాగానే వెనుక నుండి చందానగర్ వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారు జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొని తలకిందులుగా పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న తన్మయ్ను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కారును రోడ్డుపై నుండి తొలగించారు. లారీ డ్రైవర్ రమేష్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులకు తన్మయ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

నాంపల్లి కోర్టుకు ఎన్ఎస్యూఐ నేత

నాంపల్లి కోర్టుకు ఎన్ఎస్యూఐ నేత