
ఎఫ్ఓబీలు ఎందుకో!
ప్రజల కోసమా.. ప్రకటనల కోసమా ?
సాక్షి, సిటీబ్యూరో: ఉన్న సదుపాయాలను ప్రజలు వినియోగించుకుంటున్నదీ, లేనిదీ పట్టించుకోని జీహెచ్ఎంసీ.. ఎవరి ప్రయోజనాల కోసమో గానీ అవసరం లేకపోయినా కొన్ని పనులు చేస్తుంటుంది. అందుకు ఉదాహరణగా ఫుట్ఓవర్బ్రిడ్జి (ఎఫ్ఓబీ)లనే చెప్పుకోవచ్చు. నిజానికి నగరంలో ఎఫ్ఓబీల అవసరం ఎక్కువే. ప్రధాన రహదారుల్లో పలు ప్రాంతాల్లో రోడ్లు దాటలేక పాదచారులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వారి సమస్య తీర్చడం కోసం ఇప్పటికే కొన్ని ఎఫ్ఓబీలు నిర్మించిన జీహెచ్ఎంసీ.. వాటిని ఎంతమంది వినియోగించుకుంటున్నారు? అవస్థలు పడుతూ అయినా చాలామంది రోడ్డుపైనే నడుస్తున్నారు తప్ప వాటిని ఎందుకు వినియోగించుకోవడం లేదు? అనే ఆలోచనే లేకుండాపోయింది. కట్టడం వరకే మావంతు అన్నట్లుగా వ్యవహరించడంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎన్నో ఫ్లై ఓవర్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని ఏళ్ల తరబడి నిర్మాణాల్లోనే ఉన్నాయి. అయినా.. మళ్లీ కొత్తగా 86 ఎఫ్ఓబీలకు ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సిందిగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం)ను కోరింది. దాని స్టడీ పూర్తయ్యాక కొత్త ఎఫ్ఓబీలు నిర్మించేందుకు సిద్ధమైంది.
అప్పుడలా..
● పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా రోడ్డు దాటేందుకు 100 ప్రాంతాల్లో ఎఫ్ఓబీలు నిర్మించాలని ఏడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం భావించింది. ఎఫ్ఓబీలపై ప్రకటనల వల్ల వాటిని చూస్తూ వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశశం ఉండటంతో, పాదచారులకు ఉపకరించడానికే అవి ఉండాలని భావించి నిబంధనల్ని మార్చింది. ప్రకటనలు లేకుంటే ఆదాయం రాదని భావించి పీపీపీ పద్ధతిలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీలు వెనకడుగు వేశాయి. కేవలం తొమ్మిది ఎఫ్ఓబీలకు మాత్రమే ప్రైవేటు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. దాంతో ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకొని తొలిదశలో 42 ఎఫ్ఓబీలు హెచ్ఎండీఏకు, 10 ప్రాంతాల్లో జీహెచ్ఎంసీకి నిర్మాణ బాధ్యతలప్పగించింది.
● ఐదు ప్రాంతాల్లో తప్ప తాము నిర్మించలేమని హెచ్ఎండీఏ చేతులెత్తేయడంతో, 39 ఎఫ్ఓబీల నిర్మాణ వ్యయాన్ని భరించాల్సిందిగా ఆదేశించి, పనులు జీహెచ్ఎంసీకి అప్పగించింది. ఫీజిబిలిటీ తదితరాలను పరిగణనలోకి తీసుకుని 17 ప్రాంతాల్లో పనులు చేపట్టినప్పటికీ, కొన్నింటి పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇందుకు నిదర్శనం జీవీకే మాల్ దగ్గరి ఎఫ్ఓబీ. బాలానగర్, మదీనాగూడ, మియాపూర్, ఈఎస్ఐ ఆస్పత్రి (ఎర్రగడ్డ), హైదరాబాద్ సెంట్రల్ మాల్ (పంజగుట్ట), నేరేడ్మెట్ బస్టాప్, సెయింట్ ఆన్స్ స్కూల్ (సికింద్రాబాద్), సెయింట్ ఆన్స్ స్కూల్ (తార్నాక), స్వప్న థియేటర్ (రాజేంద్రనగర్), ఒమర్ హోటల్ అండ్ షాలిమార్ హోటల్, రంగభుజంగ థియేటర్, మూసాపేట క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో పూర్తయ్యాయి.
నిర్వహణ లేమి..
నగరంలో 23 ఎఫ్ఓబీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటికి నిర్వహణ లేకపోవడంతో చెత్తా చెదారాలు పేరుకుపోయాయి. పరిశుభ్రత లేకపోవడంతో పాటు కొన్నింట్లో పైకి వెళ్లేందుకు లిఫ్టులు లేక, కొన్నింట్లో లిఫ్టులు ఉన్నప్పటికీ పని చేయక నిరుపయోగంగా మారాయి. లిఫ్టులు లేని చోట అంత పైకి మెట్లు ఎక్కలేక, కష్టమైనా రోడ్డు దాటడానికే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. రోడ్డు డివైడర్లను సైతం దూకుతున్నారు తప్ప ఎఫ్ఓబీలను వినియోగించుకోవడం లేదు. ఎఫ్ఓబీలు ఉన్నచోట 5 శాతం ప్రజలు కూడా వినియోగించుకోవడం లేదు.
ఇప్పుడిలా..
గత ప్రభుత్వం ప్రమాదాలు జరుగుతాయని ప్రకటనలపై ఆంక్షలు విధిస్తే.. పురాతనమైన ఎఫ్ఓబీలను సైతం ప్రకటనలకిచ్చేందుకు, తద్వారా ఆదాయం పొందేందుకు అనుమతించాలంటూ జీహెచ్ఎంసీ ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరింది. కొత్తవాటినీ ప్రకటనల ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసేందుకే ఫీజిబిలిటీ స్టడీ కోసం ఎన్ఐయూఎంను కోరింది.
పాత ఎఫ్ఓబీలున్న ప్రాంతాలు
అనూటెక్స్ (సైనిక్పురి), హెచ్పీ పెట్రోల్బంక్ (రామంతాపూర్), నేషనల్ పోలీస్ అకాడమీ (రాజేంద్రనగర్), గగన్ పహాడ్, మహావీర్ హాస్పిటల్, ఎన్ఎండీసీ (మాసాబ్ట్యాంక్), ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్బండ్), గ్రీన్లాండ్స్ గెస్ట్హౌస్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ముఫకంజా కాలేజ్ (బంజారాహిల్స్), భారతీయ విద్యాభవన్ స్కూల్(ఫిల్మ్నగర్), వెల్స్ఫార్గో (ఖాజాగూడ), ఐఎస్బీ, ఐటీసీ కోహినూర్, మియాపూర్ క్రాస్రోడ్స్, ఆల్విన్ క్రాస్రోడ్స్ (మదీనాగూడ), మలేషియన్ టౌన్షిప్, కేపీహెచ్బీ–4 ఫేజ్, కళామందిర్ (కేపీహెచ్బీ కాలనీ), ఐడీపీఎల్, మెట్టుగూడ, రైల్నిలయం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట).
ఉన్నవాటికే దిక్కులేదు..
కొత్తగా 86 ఎఫ్ఓబీలకు రెడీ
జీహెచ్ఎంసీ రూటే సపరేటు