
ముంపు కట్టడికి ముందస్తు ప్రణాళిక
వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వరద ముప్పు ఉన్న పలు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి నీరు చేరిన డోయన్స్ కాలనీ, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి తదితర చోట్లకు ఆయన వెళ్లారు. ఎగువ నుంచి వచ్చిన వరద సాఫీగా గోపి చెరువుకు చేరే మార్గం లేని కారణంగా శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం రోడ్డు, కాలనీల్లోని నీరు చేరినట్లు గుర్తించారు. వర్షం నీరు, గోపి చెరువు నుంచి వచ్చిన వరదతో లింగంపల్లి అండర్ పాస్లో మునిగినట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
గోపి చెరువు, చాకలి చెరువులో నీటిమట్టం తగ్గించి వరద కట్టడి చేయవచ్చని సూచించారు. కొండాపూర్లోని కాసోరోస్ అపార్ట్మెంట్ పరిసరాలను రంగనాథ్ తనిఖీ చేశారు. వరద, మురుగు కాలువలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. బాచుపల్లిలో పలు వరద కాలువలను ఆయన పరిశీలించారు. ఎస్ఎన్డీపీ పథకం కింద చేపట్టిన కాలువల నిర్మాణ పనులు వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అప్పటి వరకు చెన్నం చెరువు నుంచి వచ్చే వరద రామచంద్రాపురం కాలనీలో నిలవకుండా దిగువన ఉన్న బాచుపల్లి చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వరద ముప్పునకు పరిష్కారం..
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు నగరంలోని రాజేంద్రనగర్ మండలంలోని ఉప్పర్పల్లి, శాస్త్రిపురం, పల్లె చెరువు ప్రాంతాలను రంగనాథ్ బుధవారం సందర్శించారు. ఉప్పర్పల్లిలోని అశోక్ విహార్ కాలనీలో మురుగు, వరద కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు వెళ్లారు. ఎగువ నుంచి వచ్చే వరదలతో ఐదు అపార్ట్మెంట్లలో నివసిస్తున్న 400 కుటుంబాలు ఏడేళ్లుగా తాము పడుతున్న అవస్థలను హైడ్రా కమిషనర్కు వివరించారు. 150 మీటర్ల దూరంలో మూసీ నదిని కలిపే ప్రధాన కాలువ ఉందని దానికి అనుసంధానంగా కాలువ ఏర్పాటు చేస్తే తమకు ఇబ్బందులు తప్పుతాయని విజ్ఞప్తి చేశారు. నిధులు మంజూరైనా భూయజమానులు పనులకు అనుమతించడం లేదన్నారు. ఆ కాలువను తవ్వి సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. దీంతో గురువారం ఉదయం కాలువల్ని తవ్వించిన రంగనాథ్ స్థానికుల సమస్యను పరిష్కరించారు. మైలార్దేవ్పల్లిలోని పల్లె చెరువు ఔట్లెట్తో పాటు శాసీ్త్రపురంలోని కబ్జాకు గురైన పార్కును పరిశీలించారు.
శేరిలింగంపల్లి పరిధిలో పర్యటించిన రంగనాథ్
ఉప్పర్పల్లిలో కేవలం 12 గంటల్లో సమస్య పరిష్కారం