
ఉచిత బియ్యం.. నో స్టాక్
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ‘ఉచిత బియ్యం’ నిల్వలు ఖాళీ కావడంతో డీలర్లు నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు ఒకేసారి మూడు (జూన్, జులై, ఆగస్టు) నెలల రేషన్ బియ్యం కోటాను పంపిణీ చేయడంతో బియ్యం నిల్వలపై ప్రభావం పడింది. కేటాయింపుల్లో తగినంత బియ్యం కోటా రేషన్ షాపులకు సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవంగా రేషన్ దుకాణాల్లో మూడు నెలల కోటాకు సరిపడా స్థలం లేక డీలర్లు సైతం దుకాణం కెపాసిటీకి తగిన నిల్వలు మాత్రమే గోదాముల నుంచి డ్రా చేస్తూ వచ్చారు. రేషన్ కార్డుదారులు మూడు నెలల కోటా డ్రా చేయడంతో బియ్యం నిల్వలు సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో డీలర్లు బియ్యం స్టాక్ వచ్చే వరకు దుకాణాలు మూసివేయడంతో లబ్ధి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
సన్నబియ్యంపై ఆసక్తితో..
ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై లబ్ధి కుటుంబాల ఆసక్తి పెరిగింది. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తుండటంతో ఈ నెల ఒకటి నుంచి రేషన్ షాపులకు తాకిడి పెరిగింది. గత రెండు వారాలుగా షాపుల ముందు ఉదయం నుంచే భారీగా క్యూ కట్టారు. వాస్తవంగా ఏప్రిల్ వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో కార్డుదారులు కోటా డ్రా చేసేందుకు అంతగా ఆసక్తి కనబర్చలేదు. గత నెలలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో డిమాండ్ పెరిగింది. తాజాగా మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో మరింత డిమాండ్ పెరిగినట్లయింది.
కోటా కేటాయింపు ఇలా..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలకు కలిపి సుమారు 11,02,32,403 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం దాదాపు 17.57 లక్షల కార్డులు ఉండగా, అందులో సుమారు 62,26,523 యూనిట్లు ఉన్నాయి. ఆహార భద్రత కార్డులు కలిగిన ఎఫ్ఎస్సీ కేటగిరీలో యూనిట్కు నెలకు ఆరు కిలోల బియ్యం చొప్పున మూడు నెలలకు 18 కిలోలు, ఏఎఫ్ఎస్సీ కార్డులకు నెలకు 35 కిలోల చొప్పున 105 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డులకు నెలకు 10 కిలోల చొప్పున 30 కిలోలు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు.
మూడు నెలల కోటా డ్రాకు పెరిగిన తాకిడి
రేషన్ షాపులను తెరవని డీలర్లు
ఆందోళనకు గురవుతున్న లబ్ధిదారులు