
సమావేశంలో మాట్లాడుతున్న సంగీతారెడ్డి
ప్రొస్టేట్ కేన్సర్పై అపోలో వైద్యుల పరిశోధన
సాక్షి, సిటీబ్యూరో: ప్రొస్టేట్ కేన్సర్ నిర్ధారణ, చికిత్సల కోసం అమెరికా రూపొందించిన ప్రమాణాలపై అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ యూరో ఆంకాలజీ విభాగం వైద్యులు సుమారు లక్ష మంది నుంచి సేకరించిన ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పరీక్ష (పీఎస్ఏ) నమూనాలపై పరిశోధన నిర్వహించారు. పరీక్షల్లో వచ్చిన ఫలితాలను శుక్రవారం అపోలో మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి జేఎండీ సంగీతారెడ్డి, యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ అడ్డాల వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రొస్టేట్ కేన్సర్ల గుర్తింపులో పీఎస్ఏ కీలకమన్నారు. అమెరికా వైద్య నిపుణులు 1993లో ఒక అధ్యయనం ఆధారంగా సాధారణ పీఎస్ఏ విలువలను రూపొందించినట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే.. భారతీయ ప్రమాణాలు భిన్నంగా ఉన్నట్లు తేలిందన్నారు. విశీయుల కోసం రూపొందించిన ఈ పీఎస్ఏ ప్రమాణాలనే స్వదేశంలోనూ అనుకరిస్తుండటంతో.. కేన్సర్ లేకపోయినా ఉన్నట్లు అనుమానించాల్సి వస్తోందన్నారు. రోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా.. కొత్తగా దేశీయ ప్రజల జీవన శైలికి అనుగుణంగా పీఎస్ఏ ప్రమాణాలను రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అపోలో ఆస్పత్రుల్లో కొత్త ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని, ప్రోస్టేట్ కేన్సర్లను నిర్ధారిస్తున్నట్లు వారు ప్రకటించారు.