Students Requested K Himanshu to Adopt Their Schools in Telangana - Sakshi
Sakshi News home page

హిమాన్షు అన్నా.. మా బడినీ జర దత్తత తీసుకోరాదే..!

Jul 15 2023 6:06 AM | Updated on Jul 15 2023 11:21 AM

- - Sakshi

‘హాయ్‌.. హిమాన్షు అన్నా. మేం హిమాయత్‌నగర్‌ దత్తానగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులం.

హైదరాబాద్: ‘హాయ్‌.. హిమాన్షు అన్నా. మేం హిమాయత్‌నగర్‌ దత్తానగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులం. మా బడి పరిస్థితేమీ బాలేదు. అన్నీ సమస్యలే. మీరు మాపై దయ చూపి మా స్కూల్‌ను కూడా దత్తత తీసుకోండన్నా’ అంటూ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షును అభ్యర్థించారు.

వీరికి ఏఐవైఎఫ్‌, బాలసంఘం విద్యార్థి నాయకులు మద్దతు పలికారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘మంచినీళ్లు సరిగా లేవు. మరుగుదొడ్లకు తలుపులు లేవు. నీరు లీకేజీ అవుతోంది.

మెట్లన్నీ పగిలిపోయాయి. ప్రవేశం ద్వారం వద్ద ఉన్న మోరీకి మ్యాన్‌హోల్‌ లేకపోవడంతో అందులో పడిపోతామేమో అని భయమేస్తోంది’.. ఇలా సమస్యలను ఏకరువు పెడుతూ ప్లకార్డుల ద్వారా తెలిపారు. ‘మన బస్తీ– మన బడి’లో భాగంగా ఈ పాఠశాలకు ఇంకా నిధులు రాలేదని, ఇక్కడ అన్నీ సమస్యలేనని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర తెలిపారు. –హిమాయత్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement