
ప్రజా హక్కుల రక్షణకే రాహుల్ పోరాటం
● హనుమకొండ, వరంగల్ డీసీసీ
ఆధ్వర్యంలో ర్యాలీ
హన్మకొండ/ఖిలావరంగల్: దేశ ప్రజల హక్కులను కాపాడేందుకే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు, అదేవిధంగా వరంగల్ పోస్టాఫీసునుంచి హెడ్పోస్టాఫీసు వరకు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఓటును చోరీ చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు హరించిన బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గళాలను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు బత్తిని శ్రీనివాస్రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాయిని లక్ష్మారెడ్డి, పెరుమాండ్ల రామకృష్ణ, పులి అనిల్కుమార్, ఎంపీ ఆనంద్, కార్పొరేటర్లు గుండేటి నరేందర్, బస్వరాజు శిరీష, శ్రీమాన్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.