
క్రెడిట్ కార్డుల కమీషన్ పేరుతో డబ్బులు స్వాహా..
● నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ శివకుమార్
వరంగల్ క్రైం: క్రెడిట్ కార్డుల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇస్తానంటూ బాధితుల నుంచి లక్షలు స్వాహా చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం పీఎస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్ 2023లో హనుమకొండ రాయపురలో ‘భద్రకాళి డిజిటల్ సేవ’ పేరుతో షాపు ఏర్పాటు చేశాడు. ఆన్లైన్ అప్లికేషన్స్తోపాటు కస్టమర్ల క్రెడిట్ కార్డు స్వైప్ చేసి వారికి డబ్బులు ఇచ్చేవాడు. రెగ్యులర్ కస్టమర్లను తన వాలెట్లో యాడ్ చేసుకుని వారి క్రెడిట్ కార్డుల్లో బ్యాలెన్స్ ఉంటే ఫోన్ చేసేవాడు. తాను వేరే పేమెంట్ చేసేది ఉందని చెప్పి వారి కార్డులు స్వైప్ చేసి వారికి ఎలాంటి చార్జీలు లేకుండా తానే క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లిస్తానని మోసం చేసేవాడు. కార్డులు స్వైప్ చేసిన తర్వాత వేరే కస్టమర్ల కార్డులు పేమెంట్ చేసి దానికి 4 శాతం వరకు చార్జీ తీసుకుని లాభం పొందేవాడు. ఎలాంటి కమీషన్ లేకుండా డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి డబ్బులు వాడుకున్న అనంతరం కొన్ని రోజుల తర్వాత ఇతరుల క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేవాడు. సంవత్సరంన్నర పాటు కస్టమర్లకు నమ్మకంగా ఉంటూ వారి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తూ, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ బాధితుల డబ్బుల నుంచి తన క్రాప్ లోన్, అప్పులు కట్టుకున్నాడు. ఇలా సుమారు రూ.28 లక్షలు వాడుకున్నాడు. కొద్ది రోజులుగా విజయవాడలో ఉంటున్న నిందితుడు బుధవారం షాపు ఖాళీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.