
ప్రజా ఫిర్యాదులపై శ్రద్ధ పెట్టండి
● నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
వరంగల్ అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ వహించాలి.. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హెచ్చరించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 133 అర్జీలు రాగా.. అందులో టౌన్ ప్లానింగ్ 68, ఇంజనీరింగ్ 41, హెల్త్–శానిటేషన్ 12, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)9, మంచినీటి సరఫరా 3 ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్లో ఉండకుండా చూడాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు. సిటిజన్ చార్టర్ ప్రకారం సకాలంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న, చేపట్టబోయే అభివృద్ధి పనులను నాణ్యతగా జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నిబంధనల మేరకు అంతర్గత రోడ్లు నిర్మించాలని, రోడ్ల నిర్మాణానికి ముందు తప్పకుండా మురుగు కాల్వలు నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. బల్దియా ఆధ్వర్యాన నిర్వహించే ఉద్యానవనాల్లో పచ్చదనం, లైటింగ్, ఆట వస్తువుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, అవసరం మేరకు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్లింగం, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, సిటీ ప్లానర్ రవీందర్, రాడేకర్, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.