
మత్తు పదార్థాలను నివారించాలి
న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్కుమార్తో కలిసి బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నషా ముక్త్ భారత్లో భాగంగా చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో జీవితం ఎలా నాశనం అవుతుందో వీడియో ప్రదర్శనల ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 33 ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ ఈఈకి కలెక్టర్ సూచించారు. ఈసందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రమేశ్, అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించాలి..
స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమస్య లేదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల తెల్ల రేషన్కార్డుల సర్వే 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..
బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని బీఏఎస్ స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. యాజమాన్యాలు సహకరించి వెంటనే విద్యార్థులను స్కూళ్లకు అనుమంతించాలని కలెక్టర్ కోరారు.
9 అంశాలను పరిశీలించాలి..
పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లోని 9 అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూరిస్తే వాటి ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారని కలెక్టర్ సత్యశారద అధికారులకు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
వరంగల్ కలెక్టర్ సత్యశారద