
కంప్యూటర్ నాలెడ్జ్
● అప్పుడే కొలువు సాధ్యం..లేనిపక్షంలో కలే..
● చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటున్న నిపుణులు
ఖిలా వరంగల్ : ఇంజనీరింగ్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న కోర్సు.. ఈ చదువు పూర్తయిందంటే ఉద్యోగం వచ్చినట్లే. జీవితంలో ఇక స్థిరపడినట్లే. మరిప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కోర్సు పూర్తయినా ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు. దీనికి ప్రధాన కారణం కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడమే. ఇంజనీరింగ్ విద్యతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అప్పుడే కొలువు దక్కుతుంది. లేనిపక్షంలో ఉద్యోగం కలగానే మిగులుతుంది.
చదువుకు.. చేసే పనికి ఉండని పొంతన..
ఇంజనీరింగ్ కోర్సు పూర్తయిన తర్వాత యువత ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరుతున్నారు. ఇక్కడ తన చదువుకు.. చేసే పనికి పొంతనే ఉండడం లేదు. ఎందుకంటే.. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వా త ఏం చేయాలనే అంశంపై అవగాహన ఉండడం లేదు. ఫలితంగా కొంత మంది హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, ఇతర ప్రాంతాల్లో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నారు. యువత ఇక నుంచి అలా చేయొద్దు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఈ కోర్సులు చేస్తే ఉద్యోగాలు మీ సొంతమవుతాయి. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం
ఉద్యోగ వేటలో ఇంజనీరింగ్ విద్యార్థులు..
ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం వస్తుందనుకున్న కొంతమంది విద్యార్థులు నిరుత్సాహం చెందక తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటా సుమారు 3వేలకుపైగా విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. 30 నుంచి 40 శాతంలోపే వారికి క్యాంపస్ ఇంటర్వ్యూ లు ద్వారా ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగతా వారు ఇంజనీరింగ్ పట్టాలతో ఉద్యోగాల వేట ప్రారంభిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కంప్యూటర్ నాలెడ్జ్, ఉద్యోగానికి సంబంధించిన కంప్యూటర్ కోర్సు నేర్చుకోకపోవడమే. ఫలితంగా యువత ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధంలేని ఉద్యోగాల్లో స్థిరపడుతోంది. ఉద్యోగం సులభంగా సాధించాలంటే ఇంజనీరింగ్ చదువుకు కంప్యూటర్ కోర్సు యాడ్ చేయాల్సిందే. అప్పుడే అతిసులభంగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడొచ్చు. ఇందులో కొన్ని కోర్సులు ఇలా ఉన్నాయి.
సీఎస్ఈ గ్రూప్ ..
ఇంజనీరింగ్లో సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులు 6 నెలల నుంచి సంవత్సర వరకు ఉండే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. ఆ కోర్సులు బిగ్డేటా ఎనటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లె ర్ని, సైబర్ సెక్యూరిటీ వంటి మూడు కోర్సుల నే ర్చుకోవాలి. ఇంజనీరింగ్లో మార్కులశాతంతోపా టు కంప్యూటర్ కోర్సు ఉంటేనే ఉద్యోగం వస్తుంది.
ఈఈఈ గ్రూప్ ..
ఈఈఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ కోర్సుతో పాటు పవర్ టెక్నాలజీ సోలార్ కోర్సు చేయాలి. ఈ కోర్సులు 3 నెలల నుంచి 6నెలల వరకు ఉంటాయి.
సివిల్ గ్రూప్..
సివిల్ గ్రూప్ చదివిన విద్యార్థులు స్టక్చరల్ ఇంజనీరింగ్ రివిట్ ఆర్కిటెక్చర్, రివిట్ స్ట్రక్చర్, ఆటో క్యాడ్ కోర్సులు నేర్చుకోవాలి. వీటి ద్వారా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇంజనీర్గా ఉద్యోగంలో చేరడానికి అవకాశాలు ఉంటాయి.
ఈసీఈ గ్రూప్..
ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) గ్రూప్ చేసిన వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభిస్తాయి. అయితే విద్యార్థులు కంప్యూటర్ కోర్సులు చేయాలి. ఆండ్రాయిడ్ స్టిస్టమ్, ఈఎల్ఎస్ఐ డిజైన్స్ కోర్సులతో పాటు బిగ్ డేటా ఎనటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్ని, సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేయాలి. ఈ కోర్సులు 6 నెలలు ఉంటాయి. దీంతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) కోర్సు చేస్తే మరింత ఉపయోగం.
మెకానికల్ గ్రూప్ ..
మెకానికల్ గ్రూప్ విద్యార్థులు రోబోటిక్స్ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, ఆటోకేడ్, కెటియా కోర్సులు పూర్తి చేయాలి. ఇవి మూడు నుంచి ఆరు నెలలు కోర్సులుగా ఉంటాయి. ఈకోర్సులు పూర్తి చేస్తేనే ఇంటర్వ్యూల్లో ప్రాధాన్యం ఉంటుంది.
ఈకోర్సులు హైదరాబాద్, బెంగళూరులోనే..
చదువు పూర్తయిన విద్యార్థులు వెంటనే ఇంజనీరింగ్కు సంబంధించిన కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. ఆ కోర్సులు హైదరాబాద్, బెంగళూరు, చైన్నె వంటి నగరాల్లోనే నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ కంప్యూటర్ కోర్సులు నేర్పేవారు అనుభవం కలిగి ఉంటారు. వారి సూచనలు ఉద్యోగం సాధించడానికి ఉపయోపడతాయి.
విజయానికి ముఖ్య పాయింట్లు
విద్యార్థులు ఇంజనీరింగ్లో 90 శాతం మార్కులు సాధించినా ఇంటర్వ్యూలలో వెనుకబడుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టెక్నికల్ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్స్ వంటివి పూర్తిగా కలిగి ఉంటే ఇంటర్వ్యూల్లో ఎంపికవుతారు. కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైయినింగ్కు తప్పని సరిగా వెళ్లాలి. ప్రస్తుతం అన్ని కళాశాలలో అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. ఎలా మాట్లాడాలి అనే అంశంపై తర్ఫీదు ఇస్తున్నారు.